తెలంగాణలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. జులై సెకండ్ హాఫ్ అంతా వర్షాలు దంచికొట్టాయి. కాగా వానలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఇప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాలు.. వరద నీటిలోనే ఉండగా.. ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. అయితే రాగాల రెండు రోజులలో తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ ఎత్తులో ఆవర్తనం ఉంది.. దీని కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేట, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం 3 తర్వాత పశ్చిమ తెలంగాణ, సాయంత్రం 5 తర్వాత హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది.
వర్షం కురిసే సమయంలో ప్రజలు బయటకు రావొద్దని.. ఉరుములు, మెరుపులతో పాటు పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. అధికారులు హెచ్చరించారు. మొత్తంగా రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. సో.. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉంటే బెటర్. అలానే కాలవలు, చెరువులకు సమీప ప్రాంతాల్లో నివశించే వారు కూడా అప్రమత్తంగా ఉండాలి.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..