
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల రేషన్ కార్డుల అనర్హులను ఎరివేస్తోంది. అర్హత లేకపోయినా వివిధ మార్గాల్లో రేషన్ కార్డులు పొందినవారిని గుర్తిస్తోంది. వెరిఫికేషన్లో అనర్హులుగా తేలినవారి రేషన్ కార్డులను రద్దు చేస్తోంది. ఇటీవల విచారణలో లక్షమందికిపైగా అనర్హులను గుర్తించి రేషన్ కార్డు రద్దు చేశారు. అయితే అనర్హుల గుర్తింపు ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. దీంతో అనర్హులుగా తేలితే ఎప్పుడైనా రేషన్ కార్డు రద్దు చేస్తారు. తాజాగా మరికొంతమంది రేషన్ కార్డులను రద్దు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది.
హైదరాబాద్లో దాదాపు 2 లక్షల మంది ఐటీ చెల్లింపుదారులు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టీజీ విజిలెన్స్ విభాగం రహస్య ఆడిట్లో ఈ విషయం బయటపడింది. దీంతో వీరి రేషన్ కార్డులను రద్దు చేయడంతో పాటు ఇప్పటివరకు పొందిన సబ్సిడీలను రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాన్ కార్డు, జీఎస్టీ నెంబర్లను రేషన్ కార్డు డేటాతో లింక్ చేశారు. దీంతో నగరంలో దాదాపు 2 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ రేషన్ కార్డు పొందుతున్నట్లు వెల్లడైంది. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు, ఐటీ చెల్లింపుదారులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో గుర్తించారు. అనంతరం అనర్హుల డేటా బయటకు వచ్చింది. దాదాపు 80 శాతం వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవ్వగా.. త్వరలో మిగతా విచారణ కూడా చేపడతారు. అనంతరం రేషన్ కార్డు రద్దు చేశారు.
ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారి రేషన్ కార్డులను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆధార్, పాన్ వివరాలను ఇన్కమ్ ట్యాక్స్ డేటా సాయంతో పరిశీలిస్తోంది. అనంతరం వారి ఆర్ధిక స్తోమతను అంచనా వేసి కార్డుల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. ఇక ఖరీదైన వాహనాలు కలిగి ఉన్నవారిని కూడా లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇక మరణించిన వ్యక్తుల పేర్లపై ఉన్న కార్డులను కూడా తొలగించే ప్రక్రియ షురూ చేశారు. ఇక పీఎం కిసాన్ డేటా ప్రకారం 52 వేల మందికిపైగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. రేషన్ కార్డులకు పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామాల్లో రూ.1.50 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు. నెలకు రూ.లక్ష ఆదాయం పొందుతున్న వ్యక్తులు కూడా రేషన్ కార్డు కలిగి ఉన్నట్లు అధికారులు విచారణలో బయటపడింది.