Siddipet Crime: ప్రేమ జంట అనుమానాస్పద మృతి! పెళ్లైన వ్యక్తిని ప్రేమించి.. ఇంటి నుంచి పారిపోయి.. చివరికి..
అవివాహితైన యువతి అప్పటికే పెళ్లైన యువకుడి ప్రేమలో పడింది. ఇంటి నుంచి వెళ్లిపోయి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో ఏమయ్యిందో చెట్టుకు విగతజీవులుగా వేలాడుతూ కనిపించారు. వివరాల్లోకెళ్తే..
Love couple suicide case: అవివాహితైన యువతి అప్పటికే పెళ్లైన యువకుడి ప్రేమలో పడింది. ఇంటి నుంచి వెళ్లిపోయి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో ఏమయ్యిందో చెట్టుకు విగతజీవులుగా వేలాడుతూ కనిపించారు. వివరాల్లోకెళ్తే.. సిద్దిపేట జిల్లా, ములుగు మండలం మామిడ్యాల ఆర్ ఆండ్ ఆర్ కాలనీకి చెందిన గొట్టి మహేశ్ (28)కు ఏడేళ్ల క్రితం కృష్ణవేణితో వివాహం జరిగింది. కూలీ పనులు చేసుకునే మహేశ్కు ఏడాది కిందట మర్కూక్ గ్రామానికి చెందిన పదిరి స్వప్న అనే 19 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. ఐతే అప్పటికే మహేశ్కు వివాహం అయ్యి ఉండటంతో.. పెళ్లి చేసుకునేందుకు గతేడాది డిసెంబర్లో ఇంటి నుంచి వీరిరువురు పారిపోయారు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. పోలీసులు వారిని గుర్తించి, స్టేషన్కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. పెళ్లైన వ్యక్తితో మళ్లీ వివాహం ఏంటని స్వప్నకు నచ్చజెప్పి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. ఇది జరిగిన 6 నెలల తర్వాత స్వప్న, మహేశ్ మళ్లీ కలిసి తిరగడం ప్రారంభించారు.
ఈ క్రమంలో సెప్టెంబర్ 9 (శుక్రవారం)న రాత్రి స్వప్న, మహేశ్లు మళ్లీ ఇంటి నుంచి పారిపోయారు. ఐతే ఏమైందో తెలియదు శనివారం ఉదయం కొండపోచమ్మ సాగర్ జలాశయానికి సమీపంలో ఉన్న అడవిమజీద్ అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నామని మహేశ్ తన మేనమామ అయిన నవీన్కు ఫోన్లో చెప్పి, వాట్సప్కు లోకేషన్ షేర్ చేశాడు. దీంతో నవీన్ వెంటనే తేరుకుని మహేశ్ కుటుంబ సభ్యులతోపాటు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడి దృశ్యం చూసి అందరూ షాక్కు గురయ్యారు. స్వప్న, మహేశ్లు విగతజీవులుగా చెట్టుకు వేళాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను కిందికి దించి, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు ములుగు ఎస్ఐ రంగ కృష్ణ మీడియాకు తెలిపారు.