
వేములవాడ దేవస్థానం పరిధిలోని పార్వతిపురం ధర్మశాల కార్యాలయంలో అకస్మాత్తుగా నాగుపాము కనిపించడంతో అక్కడ పని చేస్తున్న సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న దేవస్థానం అధికారులు వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కొద్ది సేపటికే సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్, భద్రతా చర్యలు తీసుకొని చాకచక్యంగా నాగుపామును పట్టుకున్నాడు. నాగుపామును పట్టుకున్న అనంతరం దానిని పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తరలించి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలివేశారు.
ఈ ఘటనతో ధర్మశాల సిబ్బంది, దేవస్థానం ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇది మొదటిసారి కాదు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో కూడా గత కొంతకాలంగా తరచూ పాములు దర్శనమిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తుల రాకపోకలు అధికంగా ఉండే సమయంలో పాములు కనిపించడంతో భయాందోళన నెలకొంటోంది. వేములవాడకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుండటంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత వల్ల పాములు బయటకు రావడానికి కారణమవుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు పరిశుభ్రత చర్యలు మరింత కఠినంగా చేపట్టాలని, పాములు రాకుండా ప్రత్యేక నివారణ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. భక్తుల భద్రతే లక్ష్యంగా దేవస్థానం పరిధిలో నిరంతర పర్యవేక్షణ, స్నేక్ క్యాచర్లను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది చదవండి: అప్పుడు పెయింటింగ్ వేసేవాడు.. ఇప్పుడు విలన్గా లక్షల్లో రెమ్యునరేషన్.. ఈ నటుడు ఎవరంటే.?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..