Munugode Bypoll: మునుగోడు ఈ ముగ్గురికి ఎందుకు ప్రతిష్టాత్మకం.. పై చేయి సాధించేదెవరు..?
ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా అధికార పార్టీకి కొంత అడ్వంటేజ్ ఉంటుంది. కానీ తెంగాణలో ఇటీవల జరిగిన మూడు ఉప ఎన్నికల్లో రెండు చోట్ల టీఆర్ ఎస్ ఓడిపోవడం ఆ పార్టీని కొంత నిరాశకు గురిచేసింది. రీసెంట్ గా హుజురాబాద్ శాసనసభ స్థానానికి జరిగిన..
తెలంగాణలో మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికలో గెలుపును ప్రధాన పార్టీలైన టీఆర్ ఎస్ (బీఆర్ ఎస్), బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కాగా.. ఇప్పటివరకు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన తర్వాత నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి హస్తం పార్టిని వీడి బీజేపీలో చేరారు. పార్టీ వీడే ముందు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహణ ప్రక్రియను ప్రారంభించడంతో నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుంది.
సాధారణంగా ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా అధికార పార్టీకి కొంత అడ్వంటేజ్ ఉంటుంది. కానీ తెంగాణలో ఇటీవల జరిగిన మూడు ఉప ఎన్నికల్లో రెండు చోట్ల టీఆర్ ఎస్ ఓడిపోవడం ఆ పార్టీని కొంత నిరాశకు గురిచేసింది. రీసెంట్ గా హుజురాబాద్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఓటమితో ఆ పార్టీ అధినేత కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగడానికి మరో ఏడాదికి పైగా గడువుంది. ఈ లోపు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితం నిదర్శనంగా చూపించాలనే లక్ష్యంతో సీఏం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ లు మునుగోడు ఉప ఎన్నికలో సత్తా చాటడం ద్వారా ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, కేసీఆర్ పాలన పట్ట సంతోషంగా లేరని, అందుకే ప్రత్యమ్నాయంగా తమనను గెలిపించారనే ప్రచారాన్ని తెలంగాణ వ్యాప్తంగా తీసుకెళ్లే యోచనలో బీజేపీ, కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో టీఆర్ ఎస్ ఓడిపోవడం ద్వారా ఆ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య తగ్గదు. ఒక వేళ బీజేపీ ఓడిపోయినా ఆ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యపై ఎటువంటి ప్రభావం చూపదు. హస్తం పార్టీ ఓడిపోతే మాత్రం ఆ పార్టీ ఖాతాలోంచి ఓ ఎమ్మెల్యే స్థానం తగ్గుతుంది. కాంగ్రెస్ మినహా ఏపార్టీ గెలిచినా ఆపార్టీకి ఒక ఎమ్మెల్యే సీటు పెరుగుతుంది.
తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ కు తామే ప్రత్యామ్నయం అని బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికలో గనుక బీజేపీ, కాంగ్రెస్ లలో ఎవరూ గెలిచినా.. మునుగోడు ప్రజల తీర్పే తెలంగాణ మొత్తం రిపిట్ అవుతుందనే ప్రచారాన్ని హోరెత్తించే అవకాశం లేకపోలేదు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో టీఆర్ ఎస్, కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉంది. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల బలం ఉంది. కాని బీజేపీకి బలం ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మాత్రమే. కమలం పార్టీకి నియోజకవర్గంలో నాయకులు ఉన్నప్పటికి క్షేత్ర స్థాయిలో టీఆర్ ఎస్, కాంగ్రెస్ తో పోలిస్తే కార్యకర్తల బలం తక్కువనే చెప్పుకోవాలి. అయినప్పటికి బీజేపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి బలమైన నాయకుడి ద్వారా ఎన్నికల్లోకి వెళ్లి గెలిచేందుకు వ్యూహా, ప్రతి వ్యూహాలను రూపొందిస్తుంది. కేవలం బీజేపీ మాత్రమే కాదు, టీఆర్ ఎస్, కాంగ్రెస్ కూడా తమ వ్యూహాలకు పదునుపెట్టాయి.
వ్యూహా రచనలో సీఏం కేసీఆర్ కొంత ముందువరుసలో ఉన్నారనే చెప్పుకోవాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో బలంగా ఉండి, ప్రస్తుతం నామ మాత్రంగా ఉన్న కమ్యూనిస్టుల మద్దతు తీసుకోవడం ద్వారా వారి ఓట్లు అధికార పార్టీ అభ్యర్థికి పడేలా ఇప్పటికే వ్యూహ రచన చేశారు. దీంతో మునుగోడులో మూడు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఏకంగా సీఏం కేసీఆర్, ముఖ్యమైన మంత్రులు సైతం ఒక గ్రామానికి ఇన్ ఛార్జిలుగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో అధికార పార్టీ ఈ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందనేది అర్థమవుతోంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యకుడు బండి సంజయ్ తన ఐదో విడత పాదయాత్రను వాయిదా వేసుకుని, మునుగోడు ఎన్నికయ్యే వరకు అక్కడే సమయం కేటాయించాలని నిర్ణయించారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు బాధ్యతలను తన భుజంపై వేసుకున్నారు. మునుగోడు ఎన్నికల ప్రక్రియ సాగుతున్న క్రమంలోనే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుండటంతో ఆ యాత్రను ఈ ఎన్నికల కోసం ఉపయోగించుకునేలా వ్యూహాలు రూపొందిస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో టీఆర్ ఎస్ బలంగా ఉండటంతో పాటు.. ఇక్కడి ప్రజలు పార్టీపై సానుకూలంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో నియోజకవర్గంలోని ప్రజల్లో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై ఎనలేని అభిమానం ఉండటంతో పాటు, పేద, మధ్య తరగతి ప్రజల్లో రాజగోపాల్ రెడ్డిపై పెద్ద వ్యతిరేకత లేదు. ప్రజలు ఆపదలో ఉంటే తనకు తోచిన సాయం చేస్తారని, వ్యక్తిగతంగా ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారని, కాంగ్రెస్ పార్టీలో చాలా మంది రాజగోపాల్ రెడ్డితోనే ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్ తో గెలుస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం. కాంగ్రెస్ శ్రేణులు రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలపకపోతే మాత్రం హస్తం పార్టీ ఈ నియోజకవర్గంలో ఒకటి లేదా రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఓటు వేసిన వారు రాజగోపాల్ రెడ్డి వైపు చూస్తే మాత్రం హస్తం పార్టీ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీఆర్ ఎస్ పార్టీపై అభిమానం ఉన్నప్పటికి వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డికి ఓటేయ్యాలని నియోజకవర్గ ప్రజలు డిసైట్ అయితే మాత్రం ఇక్కడ బీజేపీదే పైచేయి అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా రాజగోపాల్ రెడ్డిపై వ్యక్తిగత అభిమానాన్ని పక్కన పెట్టి, తాము కేసీఆర్ కు, టీఆర్ ఎస్ పార్టీకే ఓటేయ్యాలని ప్రజలు నిర్ణయించుకుంటే మాత్రం కారు పార్టీకి తిరుగుండదనే చెప్పుకోవాలి. మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ ఎవరు గెలుపొందుతారనేది నవంబర్ 6వ తేదీన తేలనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..