
20 రూపాయలు.. కేవలం 20 రూపాయల కోసం అన్నంత పని చేశాడో దుర్మార్గుడు. దారిన వెళ్తున్న వృద్ధుడిని ఆపి చాయ్ తాగేందుకు డబ్బులు కావాలని అడిగాడు. నా వద్ద లేవన్నా ఆ వృద్దుడిని వెంబడించాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. చివరకు 20 రూపాయల కోసం అన్నంత పని చేశాడు. చేతిలో ఉన్న మారణాయుధంతో తలను నరికి.. తలా మొండాన్ని వేరు చేసి అక్కడి నుండి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం కేంద్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ ఎదురుగా శుక్రవారం పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ మండలం పర్సనంబాల గ్రామానికి చెందిన మసాడి సోమయ్య (65) అనే వృద్దుడిని తుంగెడ గ్రామానికి చెందిన బోగారపు నగేష్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. మసాడి సోమయ్య ( 65 ) తన భార్య తానుబాయితో కలిసి మంగళవారం నాడు రెబ్బెన మండలం నంబాల గ్రామంలో నివసిస్తున్న తమ చిన్న కూతురు సుజాత ఇంటికి వచ్చారు. సుజాత ఇంటికి హైదరాబాద్లో ఉంటున్న సోమయ్య పెద్ద కూతురు లక్ష్మి కూడా రావటంతో ఆ ఇంట్లో పండగ వాతవరణం నెలకొంది.
శుక్రవారం వరకు చిన్న కూతురు ఇంట్లోనే ఉన్న సోమయ్య.. మధ్యాహ్నం పెద్ద కూతరు లక్ష్మి హైదరాబాద్కు వెళ్లేందుకు సిద్ధమవడంతో రెబ్బెన రైల్వే స్టేషన్లో ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్ ఎక్కించడానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు సోమయ్య. ట్రైన్ ఆలస్యమవడంతో టీ తాగేందుకు స్టేషన్ బయటకు వెళ్లాడు. ఇదే సమయంలో అక్కడే ఉన్న తుంగెడ గ్రామానికి చెందిన బోగారపు నగేష్, సోమయ్యను వెంబడించాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత నాకు రూ.20 ఇవ్వాలని సోమయ్యను అడిగాడు. సోమయ్య తన వద్ద డబ్బులు లేవని చెప్పి ముందుకు వెళ్లిపోయాడు. అయినా వదలని నిందితుడు ఆ వృద్దుడిని వెంబడించాడు.
సోమయ్య వేగం పెంచడంతో ఒక్క సారిగా తన వద్ద ఉన్న గొడ్డలితో సోమయ్య మెడపై క్రూరంగా దాడి చేశాడు. ఆ దాడిలో సోమయ్య తలా మొండం వేరాయ్యాయి. పక్కనే ఉన్న స్థానికులు కేకలు వేయడంతో నిందితుడు నగేష్ అక్కడి నుండి పారిపోయాడు. ఈ దారుణ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సోమయ్యను దారుణంగా హత్య చేసి పరారైన నిందితుడు బోగారపు నగేష్ కోసం గాలింపు చేపట్టారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి