Keesara: స్టేషన్‌కు వస్తే బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తేవాలని సతాయింపు.. కట్ చేస్తే..

కీసర పోలీస్‌ స్టేషన్‌లో పీడీఎస్‌ బియ్యం కేసులో నిందితుడిని బెయిల్ కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకోవడంతో పాటు, స్టేషన్‌కు వచ్చిన ప్రతిసారీ బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తీసుకురావాలంటూ సీఐ, ఎస్సై వేధించినట్లు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

Keesara: స్టేషన్‌కు వస్తే బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తేవాలని సతాయింపు.. కట్ చేస్తే..
ACB Trap

Updated on: Sep 17, 2026 | 2:01 PM

కీసర ఖాకీ కక్కుర్తి కథ! పీడీఎస్ బియ్యం కేసులో ఇరుక్కున్న బాధితుడిని బెయిల్ కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేయడమే కాకుండా, స్టేషన్‌కు వచ్చే ప్రతీసారీ బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తెచ్చిపెట్టాలంటూ CI, SI చేసినన రకరకాల వేధింపులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. డిమాండ్లతో విసిగిపోయిన బాధితుడు చివరికి ఏసీబీని ఆశ్రయించడంతో ఖాకీల బండారం బట్టబయలైంది. రూ.5 లక్షల లంచం డీల్‌లో భాగంగా కీసర చెరువు దగ్గర కారులో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సినిమా రీతిలో అతడిని పట్టుకున్నారు.

కాపలా ఉండాల్సిన ఖాకీలే కబ్జా కోరులైతే… రక్షించాల్సిన చేతులే లంచాలకు వెలాడితే ఎలా ఉంటుంది అనడానికి మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ ఘటన అద్దం పడుతోంది. గణేష్ నిమజ్జనం బందోబస్తు డ్యూటీలో ఉంటూ తెరవెనుక లంచాల వేలంపాట నిర్వహించిన కీసర CI ఆంజనేయులు, SIల అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

అయితే ఈ కేసులో వేధింపుల గురించే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. PDS బియ్యం కేసులో అరెస్టయిన నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఏకంగా రూ.10 లక్షలు డిమాండ్ చేసి, రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నా.. కేవలం డబ్బులతోనే ఆగలేదు. — కొన్ని రోజులుగా రోజూ తమను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తెచ్చిపెట్టాలని హుకుం జారీ చేశారు. ఒకవైపు కెమికల్ టెస్టుల పేరుతో ముప్పుతిప్పలు పెడుతూనే, మరోవైపు తమకు ఇష్టమైన బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తెప్పించుకుని మరీ తింటూ బాధితుడిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారు. వేధింపులతో, భారీ లంచాల డిమాండ్‌తో విసిగిపోయిన బాధితుడు చివరకు ఏసీబీని ఆశ్రయించాడు.

ముందస్తు వ్యూహంలో భాగంగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి కీసర చెరువు దగ్గర కారులో లంచం తీసుకుంటున్న ఎస్సైని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  పోలీసులను చూడగానే ఎస్సై చేసిన పరుగుల డ్రామా ఒకెత్తైతే, స్టేషన్‌లో ఈయన సాగించిన వేధింపుల పర్వం మేడ్చల్ జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం సీఐ, ఎస్సైల ఇళ్లపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us