KCR: వ్యూహం మారుతుందా..? కేసీఆర్ ద్రవిడ పార్టీని ఫాలో కానున్నారా..? అదే జరిగితే పెను మార్పులు..

| Edited By: Shaik Madar Saheb

Aug 15, 2024 | 12:21 PM

రాజకీయాల్లో ఒక విలక్షణమైన శైలి.. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ది.. ఆయన వ్యూహాలు.. ఎత్తుగడలు.. ఎవ్వరూ అంతగా పసిగట్టలేరు.. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు.. అధికారం వరకు ఆయన ఆందోళన కార్యక్రమాలు కూడా కొంత ఇన్నోవేటివ్ గానే ఉంటాయి.

KCR: వ్యూహం మారుతుందా..? కేసీఆర్ ద్రవిడ పార్టీని ఫాలో కానున్నారా..? అదే జరిగితే పెను మార్పులు..
BRS Chief KCR
Follow us on

రాజకీయాల్లో ఒక విలక్షణమైన శైలి.. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ది.. ఆయన వ్యూహాలు.. ఎత్తుగడలు.. ఎవ్వరూ అంతగా పసిగట్టలేరు.. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు.. అధికారం వరకు ఆయన ఆందోళన కార్యక్రమాలు కూడా కొంత ఇన్నోవేటివ్ గానే ఉంటాయి. అలాంటి కేసీఆర్ ఒక విషయంలో మాత్రం ద్రవిడ పార్టీని ఫాలో కావాలని భావిస్తున్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ నిర్మాణాన్ని ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు కేసీఆర్. డీఎంకే కి, భారత రాష్ట్ర సమితికి కొన్ని పోలికలు ఉన్నాయి. రెండు పార్టీలు కూడా స్థానిక అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఏర్పడ్డవి. రెండు పార్టీల్లోనూ విపరీత ప్రాంతీయ వాదం.. తత్వం ఉంటుంది. రెండూ కూడా జాతీయ పార్టీలను వ్యతిరేకించే పార్టీలు.. ఒక వ్యక్తి సెంట్రిక్ గా నిర్మాణమైన పార్టీలు. ఇందుకోసమే కేసీఆర్, డీఎంకే పార్టీ స్ట్రక్చర్ పై అధ్యయనం చేస్తున్నారు.

BRS కంటే చాలా ఏళ్ల ముందునుండే డీఎంకేకి తమిళనాడులో బలమైన పునాదులు ఉన్నాయి. కానీ బిఆర్ఎస్ పార్టీకి ఆ స్థాయిలో బలమైన నిర్మాణం లేదు. అన్నా డీఎంకే ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా డీఎంకే నుంచి చేరికలు లేవు.. కానీ ఇక్కడ మాత్రం పార్టీ ఫిరాయింపులు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంపై దృష్టి పెట్టారు కెసీఆర్. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే సుమన్ నేకృత్వంలో ఒక బృందాన్ని చెన్నైకి పంపించారు. డీఎంకే ఎమ్మెల్యే శంకర్ ఈ బృందానికి పార్టీకి సంబంధించిన వివరాలను సవివరంగా వెల్లడించారు.

ముఖ్యంగా డీఎంకే పార్టీలో ప్రభుత్వం కంటే పార్టీకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైనా ఎమ్మెల్యేని మంత్రి పదవి కావాలా..? జిల్లా అధ్యక్ష పదవి కావాలా..? అంటే జిల్లా అధ్యక్ష పదవి వైపే మొగ్గుచూపుతారు.. అక్కడ పార్టీకి అంతగా ప్రాధాన్యం ఇస్తారు.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు, కమిటీల మధ్య సమన్వయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పార్టీ కార్యాలయాలు ప్రతిరోజు ఏదో కార్యక్రమంతో యాక్టివ్ గా ఉంటాయి. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలకు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు.

ప్రభుత్వ పథకాల రూపకల్పన, అమలు విషయంలోనూ పార్టీ సూచనలు ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది. ఇలాంటి అంశాలపై కొంత అధ్యయనం చేసి… భారత రాష్ట్ర సమితిలోనూ ఇంప్లిమెంట్ చేయాలనేది పార్టీ ఆలోచనగా తెలుస్తుంది. ప్రస్తుతం చెన్నైలో పర్యటిస్తున్న బిఆర్ఎస్ బృందం హైదరాబాద్ చేరుకున్న వెంటనే కేసీఆర్ కి రిపోర్టు అందజేయనుంది.. ఆ తర్వాత ముఖ్య నేతల టీం మరోసారి చెన్నై వెళ్ళనున్నారు. వచ్చేనెల చివరికి పార్టీలో మార్పులు చేర్పుల విషయంలో డీఎంకెను ఫాలో కావాలన్నది కేసీఆర్ ఆలోచన అని పేర్కొంటున్నారు..

ఈ విషయాలపై క్లారిటీ లేనప్పటికీ.. కేసీఆర్ ఆలోచనలు, వ్యూహాలు మాత్రం ఎవ్వరికి అందనంతగా ఉంటాయని పేర్కొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..