
దొంగలు ఏం చేస్తారు? విలువైన వస్తువులను ఎత్తుకెళ్తారు. అయితే జగిత్యాలలో ఓ దొంగ మాత్రం ఊహించని విధంగా పాఠ్య పుస్తకాలనే దొంగిలిస్తున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వెలుగుచూసింది. కొద్దిరోజులుగా ఈ కళాశాల నుంచి విద్యార్థినుల పాఠ్యపుస్తకాలు గోధుమలు మాయం అవుతుండడంతో అధ్యాపకులకు అనుమానం వచ్చింది. దీంతో వారు కళాశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. గుర్తుతెలియని వ్యక్తి తరగతుల గదుల్లోకి ప్రవేశించి పుస్తకాలు తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.
బోనాల పండుగ సందర్భంగా సెలవుల నేపథ్యంలో విద్యార్థినులు తరగతుల గదుల్లో పుస్తకాలను ఉంచి ఇళ్లకు వెళ్లారు. సెలవు ముగిశాక కళాశాలకు వచ్చిన విద్యార్థినులు తాళం పగులగొట్టిన స్థితిలో తరగతి గదిని గుర్తించి.. లోపల పుస్తకాలు మాయం అయినట్లు గమనించారు. వెంటనే అధ్యాపకులకు సమాచారం ఇవ్వగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కళాశాలలో సుమారు 700 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారని.. ప్రహరీ లేకపోవడం వల్లే దొంగతనం జరుగుతోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.