Hyderabad: నేటి నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఫిబ్రవరి 15 వరకు..

ఈసారి జనవరి 1వ తేదీ (నేటి) నుంచి నుమాయిష్‌ ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం నుమాయిష్‌ను ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు అంటే 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. ఈసారి 2500 వరకు స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని అధికారులు తెలిపారు...

Hyderabad: నేటి నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఫిబ్రవరి 15 వరకు..
Hyderabad

Updated on: Jan 01, 2024 | 9:23 AM

హైదరాబాద్‌లో ప్రతీ ఏటా జరిగే నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌కు ఉండే క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ నలుమూలల నుంచి వ్యాపారులు స్టాల్స్‌ ఏర్పాటు చేస్తుంటారు. వేలల్లో స్టాల్స్‌తో దేశవ్యాప్తంగా లభించే అన్ని వస్తువులు ఒకేచోట అందుబాటులో ఉండడం నుమాయిష్‌ ప్రత్యేకత. ఇదిలా ఉంటే ప్రతీ ఏటలాగే ఈ సారి కూడా నుమాయిష్‌ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. 82 ఏళ్లుగా తెలంగాణలో ఏటా నుమాయిష్ నిర్వహిస్తున్నారు.

ఈసారి జనవరి 1వ తేదీ (నేటి) నుంచి నుమాయిష్‌ ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం నుమాయిష్‌ను ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు అంటే 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. ఈసారి 2500 వరకు స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని అధికారులు తెలిపారు. ఇక ఈసారి గతం కంటే అట్టహాసంగా నిర్వహిస్తామని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరగనున్న నుమాయిష్‌ నేపథ్యంలో సోమవారం నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర సీపీ కే. శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా పలు మార్గాల్లో వాహనాలను దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు.

* సిద్ధి అంబర్‌బజార్‌, జాంబాగ్‌ల వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లాలి అనుకునే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, భారీ వాహనాలు ఎంజే మార్కెట్‌ వద్ద అబిడ్స్‌ జంక్షన్‌ వైపు డైవర్ట్ చేస్తారు.

* పోలీసు కంట్రోల్‌ రూమ్‌, బషీర్‌బాగ్‌ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ జిల్లా, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌బంక్‌ నుంచి బీజేఆర్‌(బషీర్‌బాగ్‌) జంక్షన్‌ నుంచి అబిడ్స్‌ వైపు మళ్లిస్తారు.

* ఇక బేగంబజార్‌ ఛత్రీ నుంచి మాలకుంటవైపు వెళ్లే వాహనాలను అలాస్కా జంక్షన్‌ నుంచి దారుస్సలాం, ఏక్‌ మినార్‌ మసీదు, నాంపల్లి వైపు డైవర్ట్‌ చేస్తారు.

* గోషామహల్‌ రోడ్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌, అబిడ్స్‌ వైపు వెళ్లాలనుకునే వాహనాలు అలాస్కా జంక్షన్‌ నుంచి బేగంబజార్‌, సిటీ కాలేజీ, నయాపూల్‌ వైపు పంపిస్తారు.

* ఇక మూసాబౌలి/బహదూర్‌పుర వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను సిటీ కళాశాల వద్ద నయాపూల్‌, ఎంజేమార్కెట్‌ వైపు డైవర్ట్‌ చేస్తారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..