
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు – హైదరాబాద్ జాతీయ రహదారిపై పాలమాకుల వద్ద ఈ విషాద ఘటన జరిగింది. TS 07GZ 9333 నంబర్ గల ఇన్నోవా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.
మృతులను కేతవత్ లింబ్య, కేతవత్ జమున, కత్రొవత్ మానసింగ్, కేతవత్ వాస్రామ్లుగా గుర్తించారు. కారు నడుపుతున్న డ్రైవర్ సబావత్ ఆశోక్కు తీవ్ర గాయాలు కావడంతో, మెరుగైన వైద్యం కోసం అతడిని శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
గ్రామంలో తీవ్ర విషాదం..
ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతులంతా మహబూబ్ నగర్ జిల్లా, నవాబ్పేట మండలం, చౌడుర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబం వారు. ఒకేసారి నలుగురు మృతి చెందడంతో మృతుల స్వగ్రామం చౌడుర్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.