Hyderabad: మాకు ఆ బైకులంటేనే మోజు.. వీరి పంథా తెలిస్తే మీరు బిత్తరపోవడం ఖాయం

ఈ గ్యాంగు రూటే సెపరేట్. కేవలం టీవీఎస్ ఎక్స్‌ఎల్ బైక్స్ మాత్రమే తస్కరిస్తారు. అవి ఎక్కడ కనిపించినా వదిలిపెట్టరు. ఎంత తోపు దొంగలైతే మాత్రం పోలీసులకు చిక్కకుండా ఉంటారా..? వీళ్లు సైతం చిక్కారు.. ఇంతకీ వాళ్లు ఈ బైక్స్ మాత్రమే చోరీ చేయడానికి కారణం ఏంటి.. ?

Hyderabad: మాకు ఆ బైకులంటేనే మోజు.. వీరి పంథా తెలిస్తే మీరు బిత్తరపోవడం ఖాయం
Police Arrest Thieves

Edited By:

Updated on: Nov 11, 2025 | 8:26 PM

చోరీలు, దొంగతనాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. తమకు చేయి తిరిగిన, సౌలభ్యంగా ఉన్నవి కాజేయాలని చాలామంది చూస్తారు. వీళ్లు కూడా అలా డిఫరెంట్ పంథాను అనుసరించారు. కేవలం టీవీఎస్‌ మోపెడ్‌లను తస్కరించడం షురూ చేశారు. వరస మోపెడ్‌ల చోరీలతో నగరంలో కలకలం రేపారు. తాజాగా దురదృష్టం వెంటాడి పోలీసులకు చిక్కారు. గ్యాంగ్‌గా మారి మోపెడ్‌ల అపహరిస్తున్న ముగ్గుర్ని అంబర్‌పేట్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి మొత్తం 19 టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ మోపెడ్‌ బైకులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్‌ 7న ప్రేమ్‌నగర్‌లో వంట పని చేసే వ్యక్తి.. తన టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ బైక్‌ దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు శ్రవణ్‌ (28) చత్రినాకకు చెందినవాడు. కూరగాయల వ్యాపారం చేసేవాడు. అతనికి బీబీనగర్‌, మెడ్చల్‌ ప్రాంతాలకు చెదిన కాళియా రాజు (38), శకత్‌ ముఖేందర్‌ (40) అనే ఇద్దరు కార్మికులు జత కలిశారు. టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ మోపెడ్‌ బైకులు చోరీ చేస్తే యజమనాలు పెద్దగా పట్టించుకోరని భావించి.. ఆ బైకుల దొంగతనాలకు తెరలేపారు. దర్యాప్తులో శ్రవణ్‌ గతంలో అఫ్జల్‌గంజ్‌, బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కూడా చోరీ కేసుల్లో అరెస్ట్‌ అయినట్లు బయటపడింది. బీరప్పగడ్డలో రాజు, ముఖేందర్‌లతో పరిచయం ఏర్పడిన తర్వాత ముగ్గురూ కలిసి దొంగతనాల పథకం వేశారు. ధర తక్కువ బైకులు దొంగిలిస్తే బాధితులు ఫిర్యాదు చేయరని భావించి దొంగతనాలకు తెగబడ్డారు.ముగ్గురినీ BNS 303(2) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. శ్రవణ్‌ వాహనాలు దొంగిలించగా, రాజు–ముఖేందర్‌ వాటిని విక్రయించే బాధ్యత తీసుకునేవారని పోలీసులు తెలిపారు. ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మొదటివారంలోపు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 19 టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ బైకులను దొంగిలించినట్లు వెల్లడించారు. పోలీసుల మొత్తం19 బైకులు సీజ్ చేసి.. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.