
హైదరాబాద్, జూన్ 18: నగరం నిద్రలోకి జారుకున్నాక జూన్ 15-16 తేదీల అర్ధరాత్రి సమయంలో కేటీఎం డ్యూక్ బైక్ (TS08KB6055) టీఎస్పీఏ వైపు నుంచి కాళీమందిర్ వైపు వెళ్తోంది. తెల్లవారుజామున సుమారు 2:15 గంటల సమయంలో బైక్ను నడుపుతున్న యువకుడు మద్యం మత్తులో అతివేగంగా ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అతివేగం కారణంగా బైక్పై నియంత్రణ కోల్పోయిన యువకుడు రోడ్డుమధ్యలో ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డును ఢీకొట్టాడు. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో బైక్ పూర్తిగా ధ్వంసమైపోగా, బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే బైక్పై వెనుక కూర్చున్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని షాదాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను స్వయంగా బాధితులే మొబైల్ ఫోన్లో వీడియో తీయడం గమనార్హం. ప్రమాదం జరిగిన సమయంలో వారు తమ ప్రయాణాన్ని మొబైల్లో వీడియో తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో మరే ఇతర వాహనం ప్రమేయం లేదని పోలీసులు స్పష్టం చేశారు. బైక్ ఎంత వేగంతో వెళ్తోందనే విషయాన్ని సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఎలక్ట్రానిక్ సాక్ష్యాల ఆధారంగా నిర్ధారించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే బైక్ అత్యంత వేగంతో వెళ్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
Hyderabad : A speeding KTM motorcycle crashed into a road divider in Narsingi, leaving one person dead and another seriously injured. pic.twitter.com/j3adGd60J1
— Nawab Abrar (@nawababrar131) June 17, 2026
కాళీమందిర్, టీఎస్పీఏ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో గతంలో కూడా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, వేగ పరిమితులను ఉల్లంఘించడం వల్ల ప్రమాదాల తీవ్రత మరింత పెరుగుతుందని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.