
హైదరాబాద్, ఏప్రిల్ 19: కోడిగుడ్డు ప్రస్తుతం మార్కెట్ ధర ఒకటి రూ.6 పలుకుతుంది. అయితే ఓ అంగకుడు రాత్రిపూట కోడి గుడ్ల లోడ్తో వచ్చి కేవలం రూ.2లకే గుడ్డు అమ్ముతున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆఫర్ నచ్చిన జనాలు తక్కువ ధరకే గుడ్లు లభిస్తుండటంతో కొనేందుకు ఆసక్తి చూపారు. స్థానికులు ఎగబడిమరీ కొంటుంటే కొందరికి ఎందుకో అనుమానం వచ్చి ఓ గుడ్డును పగలగొట్టి చూశారు. అంతే అసలు యవ్వారం బయటపడింది. ఈ సంఘటన హైదరాబాద్లోని బొల్లారం డివిజన్ పరిధిలోని జ్యోతి థియేటర్ సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
బొల్లారం జ్యోతి థియేటర్ సమీపంలో శనివారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్రాలీ ఆటోలో వచ్చి గుడ్లను విక్రయించేందుకు ప్రయత్నించాడు. ఒక్కోగుడ్డు కేవలం రూ.2కే విక్రయిస్తున్నట్లు ప్రకటించాడు. మార్కెట్లో డజను రూ.70 నుంచి రూ.80 పలుకుతున్న గుడ్లు తక్కువ రేటుతో వస్తుండటంతో జనాలు ఎగబడి మరీ కొనడం ప్రారంభించారు. అప్పటికే పలువురు కొనుగోలు చేశారు కూడా. అయితే ఇంత తకువ ధరకే గుడ్లు అమ్మడం చూసిన కొందరికి అనుమానం వచ్చింది. తక్కువ ధరకే గుడ్లు విక్రయించడం ఏంటని ఆలోచించిన జనాలు ఓ గుడ్డును పగలగొట్టారు.
అంతే దాని నుంచి వింత వాసన, నల్లని పదార్థం కనిపించడంతో ఖంగుతిన్నారు. వెంటనే సదరు వ్యక్తిని దొరకపుచ్చకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుడ్ల అమ్మకందారుడు కొనుగోలు చేసిన వారందరికీ తిరిగి డబ్బులు ఇచ్చేశాడు. మోసం బయటపడకపోతే అక్కడి జనాల వద్ద డబ్బు దండుకుని కుళ్లిన గుడ్లను వారికి అంటగట్టేవాడు. సిటీలో ఇలాంటి మోసాలు చాలానే జరుగుతున్నాయి. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కవు ధరకు వస్తున్నాయని ఆశపడి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. కుళ్లిన గుడ్లను అమాయక జనాలకు అమ్మేందుకు ప్రయత్నించిన నిందితుడిని అవి ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు, ఎక్కడెక్కడ ఇలాంటి అమ్మకాలు జరుగుతున్నాయో కనుగొనేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.