
హైదరాబాద్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. భాగ్యనగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా నగరంలో అండర్పాస్లు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రోడ్లను అండర్పాస్లు, ఎలివేటెడ్ కారిడార్లు, సర్పేస్గా విభజించామని, నగరంలో ఎక్కడా ట్రాఫిక్ రద్దీ లేని ప్రయాణం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని, నగర శివారు ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య పెరిగిందని, వీరికి ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉపశమనం కలిగించే చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. అందులో భాగంగా నగరంలో ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
శానసమండలిలో ఇవాళ సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా శామీర్ పేట, మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించనున్నట్లు ప్రకటించారు. భూసేకరణ కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలో సంప్రదింపులు జరుపుతున్నామని, క్లియరెన్స్ వచ్చాక నిర్మాణం మొదలుపెడతామన్నారు. ఇక జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు అనేక ఇబ్బందులు ఉన్నాయని, రద్దీ ఎక్కువగా ఉన్న చోట పుట్పాత్ ఆక్రమణలను తొలగిస్తున్నామన్నారు. సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకుంటున్నామని, మల్టీ లెవల్ కారు పార్కింగ్ సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. పుట్పాత్ ఆక్రమణలను తొలగించే క్రమంలో చిరు వ్యాపారులకు వేరేచోట్ల స్థలాలు కేటాయిస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు.
మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకే మెట్రోను విస్తరిస్తున్నామని, ఎంఎంటీఎస్ సేవలను కూడా పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రోను మరో 76 కిలోమీటర్లు విస్తరిస్తామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని చెప్పారు. మెట్రో విస్తరణ చేపట్టేందుకు ఎల్అండ్టీ సంస్థ ముందుకు రాలేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. రూ.15 వేల కోట్లు కేటాయించి మెట్రోను స్వాధీనం చేసుకున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో కాలుష్యం వెదజల్లే కంపెనీలను ఓఆర్ఆర్ బయటకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో హైదరాబాద్ అద్బుత నగరంగా మారుతుందని, క్యూర్, ప్యూర్, రేర్గా నగరాన్ని విభజించి ట్రాఫిక్ రద్దీ తగ్గేలా చూస్తున్నట్లు రేవంత్ చెప్పారు. రాబోయే రోజుల్లో నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రాయణం అందుబాటులోకి వస్తుందన్నారు. మెట్రో విస్తరణతో నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.