
హైదరాబాద్ కూకట్పల్లిలోని వివేకానందనగర్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయింది. ఏపీ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తరలిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు కోట్ల రూపాయల విలువైన 840గ్రాముల కొకైన్, ఎపిడ్రిన్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఐదు మొబైల్స్, 50 వేల నగదు సీజ్ చేశారు. ఇక.. నిందితుల్లో ఒకరు తిరుపతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నట్లు గుర్తించారు. తిరుపతి కానిస్టేబుల్ గుణశేఖర్ తోపాటు మరో ఐదుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్పై కీలక విషయాలు వెల్లడించారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. తిరుపతిలో ప్రారంభమైన డ్రగ్స్ ముఠా దందా.. బాపట్ల.. గుంటూరు నుంచి హైదరాబాద్ మీదుగా కొనసాగుతున్నట్లు తెలిపారు.
అరెస్టయిన వారంతా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారేననని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మహిళను కూడా అరెస్టు చేశారు. తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్(40), తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర(31), బాపట్ల జిల్లా కర్ల పాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతి రెడ్డి హరిబాబు రెడ్డి (38), అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫియాడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్(34), షేక్ మస్తాన్వలీ(40), దేవరాజు యేసుబాబు(29) కలిసి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డ్రగ్స్ కేసులో పోలీసు ఉద్యోగంలో ఉన్న వ్యక్తి పట్టుబడటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
కాగా.. పెద్ద ఎత్తున డ్రగ్స్ లభించడం హైదరాబాద్ లో కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..