హైదరబాద్‌లో వాన బీభత్సం.. నదుల్లా మారిన రోడ్లు.. ఒకరు మృతి, ఇద్దరు గల్లంతు

హైదరాబాద్ మహానగరం జలదిగ్బంధం.! క్లౌడ్ బరస్ట్ అయిందా అన్నట్టు మేగమంతా వచ్చి భాగ్యనగరంపై పడింది. హైదరాబాద్‌లో రాత్రి వర్షం దంచి కొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. నాలాలు, మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

హైదరబాద్‌లో వాన బీభత్సం.. నదుల్లా మారిన రోడ్లు.. ఒకరు మృతి, ఇద్దరు గల్లంతు
Hyderabad Rain

Updated on: Sep 18, 2025 | 6:57 AM

హైదరాబాద్ మహానగరం జలదిగ్బంధం.! క్లౌడ్ బరస్ట్ అయిందా అన్నట్టు మేగమంతా వచ్చి భాగ్యనగరంపై పడింది. హైదరాబాద్‌లో రాత్రి వర్షం దంచి కొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌తో ముందుకు పోలేక, వెనక్కి రాలేక వాహనదారులు నరకం చూశారు. జీహెచ్ఎంసీ మాన్‌నూన్‌ టీంలు రంగంలోకి దిగి నీరు నిలిచిన ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్​ను క్లియర్ చేశారు. నాలాలు, మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

భారీ వర్షానికి ఎస్‌ఆర్‌ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. బల్కంపేట్‌ అండర్‌ గ్రౌండ్‌ రైల్వే బ్రిడ్జి దగ్గర వర్షపు నీటిలో పడి వాహనదారుడు మృతి చెందాడు. వర్షానికి రోడ్లన్నీ జలమయమై, అనేక ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

అంబర్‌పేటలో కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది. దాంతో బైకులు, కార్లు వరదలో చిక్కుకున్నాయి. వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో తమ వాహనాలను కాపాడుకునేందుకు జనం శ్రమించాల్సి వచ్చింది. సికింద్రాబాద్‌ ఏరియాలోనూ భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మెట్టుగూడలోని పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. చాలా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో రాత్రంతా కాలనీ వాసులు ఇబ్బందిపడ్డారు. చిక్కడపల్లిలోనూ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. పలు వీధుల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఆందోళన చెందారు. తమను కాపాడాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు.

జీడిమెట్ల ప్రాంతంలో భారీ వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. మోకాళ్ల లోతు వరకు చేరిన వర్షపు నీటితో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మియాపూర్‌లోని చాలా అపార్ట్‌మెంట్లలో సెల్లార్లలోకి వరద నీరు చేరిపోయింది. దీంతో కార్లు, టూవీలర్లు వరద నీటిలోనే ఉండిపోయాయి. అపార్ట్‌మెంట్‌ వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్‌లోని గంగారం జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రవాణాకు ఆటంకం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి.

ఆసిఫ్‌నగర్‌లో పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. నగరంలో మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. దీంతో మ్యాన్‌హోళ్లను ఓపెన్‌ చేసి, నీటిని వదిలారు పోలీసులు. ట్రాఫిక్‌ సమస్యలు, విద్యుత్తు అంతరాయంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. మాసబ్‌ట్యాంక్‌లో మేయర్‌ విజయలక్ష్మి పర్యటించారు. లక్డీకాపూల్‌, ఖైరతాబాద్, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, చింతలబస్తీ ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన సహాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు.

రిపోర్ట్స్ ప్రకారం రెయిన్‌ఫాల్‌ డేటాః

ముషీరాబాద్‌ 18.4

చిలకలగూడ 14.7

మోండా మార్కెట్‌ 14.6

హెచ్‌సీయూ 14.4

బేగంపేట్‌ 13.5

లింగంపల్లి 13

ఖైరతాబాద్‌ 12.5

శ్రీనగర్ కాలనీ 11.1

బేగంపేట్‌ 11

షేక్‌పేట్‌ 10.8

చందానగర్‌ 10.2

కాప్రా 9.4

బీహెచ్‌ఈఎల్‌ 8.8

కూకట్‌పల్లి 9.5

మూసాపేట్‌ 8.6

భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలు ఇబ్బంది పడుకుండా చూడాలని అన్నారు. నీళ్లు నిలిచిన, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిన చోట్ల పోలీస్‌, ట్రాఫిక్‌, హైడ్రా విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలున్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..