Telangana: ఆ రోజు రానే వచ్చేస్తోంది.. మరి కొన్ని గంటల్లో రైతన్నల ఖాతాల్లోకి డబ్బు..

|

Jul 17, 2024 | 8:10 PM

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో ముఖ్యమైన హామీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. గురువారం సాయంత్రానికి రూ. లక్ష లోపు రుణాల మాఫీ కోసం 7వేల కోట్లు విడుదల చేయనున్నారు...

Telangana: ఆ రోజు రానే వచ్చేస్తోంది.. మరి కొన్ని గంటల్లో రైతన్నల ఖాతాల్లోకి డబ్బు..
Crop Loan Telangana
Follow us on

తొలి ఏకాదశి రోజున.. తెలంగాణ రైతులకు నిజమైన పండగ లాంటి వార్త చెప్పింది రేవంత్ సర్కార్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీకి కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది. మరికొన్ని గంటల్లో నిధుల విడుదల ప్రక్రియ మొదలు కాబోతోంది. రైతుల ఫోన్లు టింగు.. టింగు మని మోగబోతున్నాయి. ఈ రుణమాఫీ ప్రక్రియను రాష్ట్రమంతా పండుగలా జరపబోతోంది హస్తం పార్టీ. ఇంతకీ ఎప్పటిలోపూ రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది. 2లక్షల రుణమాపీకి ఎన్ని నిధులు అవసరం అవుతాయి?

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో ముఖ్యమైన హామీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. గురువారం సాయంత్రానికి రూ. లక్ష లోపు రుణాల మాఫీ కోసం 7వేల కోట్లు విడుదల చేయనున్నారు. కాగా ఈ నెలాఖరులోగా లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయనున్నామని, ఆగస్టు 15 నాటికి 2లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు.

రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని కాంగ్రెస్ చెబుతోంది. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆగస్టు 15లోగా రుణమాఫీ పూర్తవుతోందని కాంగ్రెస్ ధీమాగా చెప్తోంది. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ మాటను గౌరవిస్తూ రుణమాఫీ చేస్తున్నామన్నారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే చేసి తీరుతారన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని రేవంత్ అన్నారు.

ఇక బీఆర్‌ఎస్‌పై కూడా ఈ సందర్భంగా రేవంత్ విమర్శలు కురిపించారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ 28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారన్నారు. కానీ ఈ ప్రభుత్వం 7 నెలల్లోనే 31వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్నామన్నారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా రైతులకు మేలు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో దేశానికే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇదే కాకుండా ఈ ఏడు నెలల్లోనే సంక్షేమానికి 30వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొచ్చారు. ఆర్ధిక నిపుణులు కష్టమని చెప్పినా.. ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు సాగుతున్నామన్నారు సీఎం రేవంత్. రుణమాఫీ నిధుల విడుదలకు ప్రక్రియ కూడా మొదలైపోయిందన్నారు.

చేస్తున్న ఈ మంచిని ప్రజలకు వివరించాలి. వాడవాడలా ఇదో పండగలా జరపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో బైక్ ర్యాలీలు చేపట్టి.. పండగలా వేడుకలు నిర్వహించి.. హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఇక గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ ఈ విషయంపై చర్చ జరగాలన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చామని పార్లమెంట్‌లోనూ ఎంపీలు ప్రస్తావించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గత ప్రభుత్వంలాగా మాటలతో మభ్యపెట్టకుండా.. రైతును రుణ విముక్తి చేసిన తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేయాలని పార్టీ పిలుపునిచ్చింది.

రుణమాఫీని అమలు చేసేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని, రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు దఫాలుగా 25వేల చొప్పున ఇచ్చారు. కానీ ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. రెండు లక్షల రుణమాఫీని ఒకే విడతలో పూర్తి చేస్తోందన్నారు. ప్రతి కార్యకర్త తల ఎత్తుకుని సగర్వంగా చెప్పుకునే సందర్భం ఇదన్నారు డిప్యూటీ సీఎం భట్టి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..