
సంక్రాంతి పండుగకు సొంతూరికి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పనుంది తెలంగాణ సర్కార్. టోల్చార్జీలు ప్రభుత్వమే భరించే దిశగా ఆలోచిస్తోంది. హైవేలపై ట్రాఫిక్ జామ్ నుంచి ఉపశమనం కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై ఇవాళ తెలంగాణ సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. మీటింగ్ అనంతరం ప్రకటన చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే కేంద్రానికి లేఖ కూడా రాయనుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఏటా సంక్రాంతి సమయంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న పంతంగి, కొర్లపాడు టోల్ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటోంది. టోల్ప్లాజాల కారణంగా హైవేలపై ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఒక్కోసారి ప్రయాణికులు గంటలతరబడి వేచిచూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పండగ వేళ హైవేలపై ట్రాఫిక్ జామ్లకు స్వస్తి పలికి, ప్రయాణికులు వేగంగా గమ్యం చేరేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల టోల్చార్జీలను తామే భరిస్తాం, అందుకు అనుమతినివ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కారు లేఖ రాయనుంది. కేంద్రం అనుమతిస్తే విజయవాడ, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరట కలగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..