Telangana Elections: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. అధికార పార్టీ బీఆర్ఎస్పై రాహుల్ చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. కుటుంబ పాలన, అవినీతిపై కాంగ్రెస్ నేతలకు మాట్లాడే హక్కులేదంటూ విమర్శిస్తున్నారు. తెలంగాణ కుటుంబ పాలన కొనసాగుతుందని.. బీఆర్ఎస్.. బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనంటూ రాహుల్ మాట్లాడటం సిగ్గుచేటంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఎవరు..? రాహుల్, ప్రియాంక సమాధానం చెప్పాలి.. అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ను ఎవరూ నమ్మరంటూ కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాహుల్గాంధీ చేసిన విమర్శలను తెలంగాణ మంత్రి నిరంజన్రెడ్డి తిప్పికొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై అసత్యాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారసత్వ రాజకీయాలపై రాహుల్ మాట్లాడడం పెద్ద జోక్ అని అన్నారు. రాహుల్గాంధీది ఐదు తరాల వారసత్వం అంటూ నిరంజన్రెడ్డి కౌంటరిచ్చారు.
కాంగ్రెస్ బస్సు యాత్ర రాహుల్కు టైంపాస్ యాత్ర అంటూ జగదీష్ రెడ్డి విమర్శించారు. అవినీతికి పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదేనన్నారు. రాహుల్కు ఉన్న ఏకైక అర్హత వారసత్వమేని.. కుంభకోణాల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదంటూ జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి రాహుల్ అభాసుపాలయ్యారని.. కాంగ్రెస్ ఎన్ని యాత్రలు చేసినా.. బీఆర్ఎస్ జైత్రయాత్రను అడ్డుకోలేరంటూ టీవీ9తో మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి ప్రచారం మొదలుపెడితే అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తమపై విమర్శలు చేయడం కాదు..ముక్కలవుతున్న కాంగ్రెస్ను కాపాడుకోవాలంటూ మంత్రి సత్యవతి సూచించారు. ములుగులో కాంగ్రెస్ ఓటమి ఖాయమంటూ MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీనే తమ పథకాలు కాపీకొట్టి ఆరు గ్యారెంటీలు అని చెబుతోందని భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. రాహుల్ని ఎంపీగా డిస్క్వాలిఫై చేసినపుడు మొదట స్పందించిందే కేసీఆర్ అన్నారు. అలాంటి ఇప్పుడు రాహుల్ తమను బీజేపీ బీ టీమ్ అనడం దారుణమంటూ గండ్ర ఫైర్ అయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..