సోషల్ మీడియాలో రెచ్చిపోవద్దు.. టీ.సర్కార్ వార్నింగ్

ప్రపంచం యావత్తు కరోనా వైరస్ భయంలో వణికిపోతున్న తరుణంలో సోషల్ మీడియాలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం...

సోషల్ మీడియాలో రెచ్చిపోవద్దు.. టీ.సర్కార్ వార్నింగ్
Follow us

|

Updated on: Apr 01, 2020 | 3:43 PM

Telangana government warned people & media over social media postings: ప్రపంచం యావత్తు కరోనా వైరస్ భయంలో వణికిపోతున్న తరుణంలో సోషల్ మీడియాలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అతివేగంగా విస్తరిస్తున్న వైరస్ ఒకవైపు ప్రపంచాన్ని భయకంపితులను చేస్తుంటే.. ఏ మాత్రం క్రాస్ చెక్ చేసుకోకుండా సోషల్ మీడియాలో పోస్టు చేయడం… వాట్సప్ సందేశాలలో ఫార్వర్డ్ చేయడంతో ప్రజల్లో మరిన్ని అపోహలు, అసత్య ప్రచారం పెరిగిపోతుందని గుర్తించిన ప్రభుత్వం విచ్చలవిడిగా స్ప్రెడ్ అవుతున్న వదంతులను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగింది.

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిచెందిన దేశాలు, వర్ధమాన దేశాలు అన్న తేడా లేకుండా ప్రతీ చోటా కోవిడ్-19 ప్రబలుతోంది. ఇటువంటి క్లిష్టమైన సమయంలో ప్రభుత్వాలు, ప్రజలు ఈ వైరస్ గురించి అవగాహన పెంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఈ ప్రయత్నంలో రెగ్యులర్ సమాచార, వార్తా సంస్థలతో పాటూ ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్, షేర్ చాట్, టిక్ టాక్ వంటి అనేక సామజిక మాధ్యమాలు, ఇంకా వెబ్‌సైట్లు, మొబైల్ యాప్స్ తదితర డిజిటల్ మాధ్యమాలలో చాలా వార్తలు.. మరెన్నో వదంతులు సర్క్యులేట్ అవుతున్నాయి.

అయితే అతివేగంగా ప్రపంచమంతా ఈ కొత్త వైరస్ సోకుతుండడంతో సాధికారిక, ప్రామాణిక సమాచారం ఇంకా ఆశించినస్థాయిలో అందుబాటులో లేదు. అందువల్ల కొంతమంది తమ అవగాహనా లోపం వల్ల, లేదా ఆకతాయితనం వల్ల అనేక రకాల తప్పుడు సమాచారాన్ని, వదంతుల్ని వ్యాపింప చేస్తున్నారు. ఈ తప్పుడు సమాచారం, వదంతులు కూడా మరొక మహమ్మారిగా తయారై సాధారణ ప్రజలకి, ప్రభుత్వ యంత్రాంగానికి మరో సవాలుగా పరిణమిస్తున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధ్యతారహితమైన ఈ విచ్చలవిడి తప్పుడు సమాచార, వదంతుల వ్యాప్తిని ఇన్పోడెమిక్ (Infodemic)గా అభివర్ణించింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ పౌరులకు, మీడియాకు ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగం కొన్ని సూచనలు చేసింది. అదే సమయంలో వాటిని ఉల్లంఘిస్తే తగిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చింది. డిజిటల్ మాధ్యమాలలో వచ్చిన సమాచారాన్ని ఇతరులతో పంచుకునే ముందు బాధ్యతతో వ్యవహరించాలని, కొంచెం జాగ్రత్త వహించాలని సూచించింది. సమాచార ప్రామాణికతను రూఢీ చేసుకోకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ సమాచారాన్ని ఇతరులకు చేరవేయవద్దని హెచ్చరించింది.

వాట్సాప్ వంటి వేదికలలో బృంద సభ్యులు ఎవరైనా తప్పుడు సమాచారం వ్యాపింపచేస్తే ఆ బృందపు అడ్మిన్స్ దానికి బాధ్యులవుతారని, చట్టపరంగా విచారణను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. డిజిటల్ మాధ్యమాలను ఇప్పుడిప్పుడే వాడుతున్న వారు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం లేని వారి విషయంలో మరింత దృష్టి పెట్టాలని, వారికి ఆ మాధ్యమాలకున్న బలం, బలహీనతలు, పరిధులు, పరిమితులు, అనుకూల, ప్రతికూలతల గురించి వివరంగా చెప్పాలని, వాటి దురుపయోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన చర్యలపై అవగాహన కలిగించాలని తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగం నిర్ణయించింది.

‘‘కరోనా మహమ్మారి విషయంలో అనేక రకాల తప్పుడు సమాచారం వ్యాపిస్తోంది. ఇటువంటి సందర్భాల్లో వ్యక్తిగత వివరాల గోప్యత అత్యంత ముఖ్యమైన అంశం. వ్యాధి బారిన పడిన వ్యక్తుల గురించి ఎవరు సమాచారం పంపినా దాన్ని మీరు ఇతరులకు పంపకండి. మొదటగా ఆ సమరం ప్రామాణికమైనది కాకపోవచ్చు, ఒక వేళ అది ప్రామాణికమైనదైనా అది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించవచ్చు. ఇది అనైతికమే కాదు శిక్షార్హమైన నేరం కూడా…’’ అని డిజిటల్ మీడియా విభాగం తెలిపింది. విపత్తుల విషయంలో వదంతులను, తప్పుడు సమాచారాన్ని వ్యాపింప జేసే వారికి విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని 54వ సెక్షన్ ప్రకారం ఒక సంవత్సరం పాటు జైలుశిక్ష ఇంకా జరిమానా విధించే అవకాశం ఉందని, ఇంకా ఐపీసీ సెక్షన్ 505 ప్రకారం కూడా తప్పుడు సమాచార ప్రచారం శిక్షార్హమౌతుందని తెలిపింది.

కరోనా మహమ్మారి నియంత్రణకై తెలంగాణ ప్రభుత్వం అంటువ్యాధుల చట్టం, 1897 కింద తెలంగాణ అంటువ్యాధులు (కోవిడ్-19) నిబంధనలను విడుదలచేసింది. ఈ నిబంధనలలోని 10వ సెక్షన్ ప్రకారం కరోనా వైరస్ కు సంబంధించిన ఎటువంటి సమాచారాన్నైనా సంబంధిత అధికారులతో ధృవీకరించుకోకుండా వార్తా పత్రికలు, టీవీ చానెళ్లు, సామాజిక మాధ్యమాలలో వ్యాప్తి చేయకూడదు. దీనికి విరుద్ధంగా వదంతులు, తప్పుడు సమాచారాన్ని ఎవరైనా వ్యాప్తి చేస్తే సంబంధిత చట్టాల కింద శిక్షార్హులవుతారు.

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రామాణిక సమాచారం అందరి అవసరం. కరోనా మహమ్మారిపై సమరంలో అది చాలా కీలకం కూడా. డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించే వారు ఏ సమాచారం, వార్త ప్రామాణికతపై సందేహం వచ్చినా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే సమాచారం, ప్రధాన స్రవంతి వార్తా మాధ్యమాలు ప్రచురించే, ప్రసారంచేసే సమాచారంతో పోల్చి సరిచూసుకోవాల్సి వుంటుంది.

సమాచార మాధ్యమాలకు డిజిటల్ మీడియా విభాగం సూచనలు:

1. కరోనా వంటి మహమ్మారిని రూపుమాపడంలో సమాచార మాధ్యమాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రవ్యాప్త లాక్ డౌన్ కి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేసే మహత్తర బాధ్యతను అవి నిర్వర్తిస్తున్నాయి.

2. సామాజిక మాధ్యమాలలో వ్యాప్తిలో ఉన్న సంచలనాత్మక, భయాందోళనలకు గురిచేసే, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని కొన్ని ప్రధాన స్రవంతి వార్తా పత్రికల ఆన్‌లైన్ ఎడిషన్లు, వెబ్ మ్యాగజీన్లు, ఆన్‌లైన్ న్యూస్ సైట్లు యధాతథంగా ప్రచురిస్తున్నాయి. అదే విధంగా ఎలక్ట్రానిక్ మాధ్యమాలు తమ యూ ట్యూబ్ ఛానెళ్లలో ఇటువంటి వార్తలను ప్రసారం చేస్తున్నాయి.

3. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు చాలా వార్తలను తప్పుదోవ థంబ్ నెయిల్స్ (thumbnails)తో పోస్ట్ చేస్తున్నాయి. సంబంధిత వార్తకు, సమాచారానికి సంబంధం లేని ఈ థంబ్ నెయిల్స్ వీక్షకుడిని తప్పుదోవ పట్టించడమే కాకుండా, సమాచారాన్ని కలుషితం చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అవహేళన చేసే విధంగా, వారిపై చులకన భావం కలిగించేదిగా, వారి మనోస్థైర్యాన్ని దెబ్బ తీసేవిధంగా ఈ వీడియోలు ఉండడం విచారకరం. ఇది అనైతికమే కాదు ఆ డిజిటల్ మాధ్యమాల నిబంధనలకు విరుద్ధం.

4. పదే పదే ఇటువంటి తప్పుదోవ పట్టించే వార్తలు, వీడియోలని ప్రచురించే, ప్రసారం చేసే వేదికలపై డిజిటల్ మీడియా విభాగం సంబంధిత సామాజిక మాధ్యమ సంస్థల దృష్టికి తీసుకెళ్లి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా ఇటువంటి వార్తలు, వీడియోలను పోస్టు చేస్తున్న ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్ల కు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం నిలిపివేసే అవకాశం ఉంటుంది. తరచుగా తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే చానెళ్లను ఆ సామాజిక మాధ్యమ సంస్థలు పూర్తిగా తొలగించే అవకాశం కూడా ఉంది.

5. ఇటువంటి వార్తలు, వీడియోలు తెలంగాణ అంటు వ్యాధులు (కోవిడ్-19) నిబంధనలు, విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని 54వ సెక్షన్, ఐపీసీ సెక్షన్ 505 కింద ఉల్లంఘనలుగా పరిగణించబడతాయి. పై చట్టాలే కాకుండా ఇతర నిబంధనలను అనుసరించి ఆ సంస్థలు/ సంస్థల యజమానులు శిక్షార్హులవుతారు.

6. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలకు డిజిటల్ మీడియా వేదికలు అత్యంత ప్రయోజనకారి అవుతాయి. అనేక వార్తా సంస్థలు, సమాచార మాధ్యమాలు డిజిటల్ మాధ్యమాలను అత్యంత ప్రభావవంతంగా సమాజహితం కోసం వాడుతున్నాయి. వారందరికీ ధన్యవాదాలు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి, అంతిమంగా విజయం సాధించడానికి సామాన్య ప్రజలు, సమాచార, వార్తా సాధనాలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన సమయమిది. ఇది సమిష్టిగా చేయాల్సిన ప్రయత్నం, ఇది ఖచ్చితంగా గెలవాల్సిన యుద్ధం!