కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలో కలిసిన కోమటిరెడ్డి, సానుకూలంగా స్పందించి, మళ్లీ రావాలని వెంకటరెడ్డికి ఆహ్వానం.!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. టీపీసీసీ పీఠం కోసం గట్టిగా..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. టీపీసీసీ పీఠం కోసం గట్టిగా ప్రయత్నిస్తోన్న కోమటిరెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. పనిలోపనిగా ఇవాళ కోమటిరెడ్డి కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు జాతీయ రహదారి అభివృద్ది పనులకు రూ. 600 కోట్లు మంజూరు అయినందుకు కృతజ్ఞతలు తెలిపిన కోమటిరెడ్డి, అలాగే భువనగిరి లోకసభ నియోజకవర్గంలోని పలు ప్రాజెక్టులకు సంబంధించి వినతి పత్రం సమర్పించారు. మిర్యాలగూడ పట్టణం బాగా విస్తరిస్తున్నందున మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి 167లో అలీనగర్ నుంచి మిర్యాలగూడ వరకు జాతీయ రహదారి విస్తరణపనులు చేపట్టాలని కోరినట్లు కోమటిరెడ్డి భేటీ అనంతరం వెల్లడించారు.
అలాగే ఎన్హెచ్ – 365లో నకిరేకల్ నుంచి తానంచెర్ల వరకు నూతనంగా రోడ్డు విస్తరణ పనులు మంజూరు అయ్యాయని అందులో అర్వపల్లి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వివరించారు. అంతేకాదు… ఓఆర్ఆర్ గౌరెల్లి నుంచి కొత్తగూడె ఎన్హెచ్ – 30 వరకు నూతనంగా మంజూరైన ప్రాజెక్టుకు జాతీయ రహదారి నెంబర్ కేటాయించి డీపీఆర్లను ఆమోదించి నిధులు మంజూరు చేయాలని కూడా వినతి పత్రంలో పేర్కొన్నట్టు కోమటిరెడ్డి తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెంటనే ఈ నూతన ప్రాజెక్టులపై నివేదికలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారం తరువాత ఈ ప్రాజెక్టులపై చర్చించడానికి రావాలని కూడా ఎంపీ కోమటిరెడ్డిని కేంద్ర మంత్రి గడ్కరీ ఆహ్వానించారని ఎంపీ వెల్లడించారు.