
దేశంలోని జాతీయ రహదారుల పర్యవేక్షణ మరింత కఠినతరం, అత్యాధునికంగా మారనుంది. రహదారుల నిర్వహణ, మరమ్మత్తులను మెరుగుపరచడానికి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ఆధారిత డాష్క్యామ్ పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని భావిస్తోంది. ఈ ప్రణాళిక సుమారు 40,000 కిలోమీటర్ల జాతీయ రహదారి నెట్వర్క్ను కవర్ చేయనుంది.
కొత్త వ్యవస్థ ప్రకారం, రూట్ పెట్రోల్ వాహనాలకు ప్రత్యేక డాష్బోర్డ్ కెమెరాలను అమర్చుతారు. ఇవి వారానికోసారి రోడ్లను సర్వే చేస్తాయి. ఈ కెమెరాలు అధిక రిజల్యూషన్ గల చిత్రాలను, వీడియోలను రికార్డ్ చేస్తాయి. వీటిని మెషిన్ లెర్నింగ్ టెక్నిక్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి విశ్లేషిస్తారు. AI వ్యవస్థ స్వయంగా లోపాలను గుర్తిస్తుంది.
ఈ ఏఐ వ్యవస్థ గుంతలు, పగుళ్లు, ఎగుడుదిగుడు రోడ్లు, మసకబారిన లేన్ గుర్తులు, పనిచేయని వీధి దీపాలు, విరిగిన క్రాష్ బారియర్లు, అక్రమ కర్బ్ కట్లతో సహా 30 రకాలకు పైగా రోడ్డు లోపాలను ఆటోమెటిక్గా గుర్తిస్తుంది. ఇది అక్రమ పార్కింగ్, రహదారి ఆక్రమణలను కూడా పర్యవేక్షిస్తుంది. రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని, రహదారిపై ఏర్పాటు చేసిన లైట్లు, సైన్ బోర్డులు, రిఫ్లెక్టర్ల పరిస్థితిని అంచనా వేయడానికి, నెలకు కనీసం ఒకసారి రాత్రిపూట సర్వే నిర్వహించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.
ఈ మొత్తం వ్యవస్థ కోసం ఒక ప్రత్యేక ఐటీ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేస్తోంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది డేటా నిర్వహణ, ఏఐ విశ్లేషణలు, పర్యవేక్షణ కోసం ఒక డాష్బోర్డ్ను అందిస్తుంది. దీని ద్వారా వివిధ సమయాల్లోని రహదారి పరిస్థితులను పోల్చి చూస్తూ మరమ్మతు పనుల పురోగతిని పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. జాతీయ రహదారిపై సకాలంలో మరమ్మతులు జరిగేలా చూస్తుంది. రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తుంది. ప్రయాణికులకు సురక్షితమైన, సులువైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని NHAI పేర్కొంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.