Payment: అరచేతిని స్కాన్ చేస్తే చాలు.. కొత్త పేమెంట్ విధానం చూస్తే షాక్ అవ్వాల్సిందే..
ప్రస్తుతం భారత్ లో యూపీఐ పేమెంట్స్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ విధానంలో పేమెంట్ చేయాలంటే మొబైల్ ఫోన్ తీసి స్కాన్ చేయాలి. అయితే కేవలం అరచేతిని స్కాన్ చేయడం ద్వారా పేమెంట్స్ చేసే విధానం అందుబాటులోకి వస్తే ఎలాం ఉంటుంది.? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా చైనాలో ఈ విధానం ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసింది..
ప్రస్తుతం మన దేశంలో యూపీఐ పేమెంట్స్ ఓ రేంజ్లో పెరిగిపోయాయి. కలలో కూడా ఊహించని విధంగా పేమెంట్స్ ఆప్షన్స్ వచ్చేశాయి. చేతిలో స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేస్తే చాలు పేమెంట్స్ చేసుకునే అవకాశం లభించింది. ఒకప్పడిలా డబ్బులు వెంట పెట్టుకొని వెళ్లాల్సిన పనిలేకుండా పోయింది. జేబులో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎక్కడైనా పేమెంట్ చేసుకోవచ్చు.
ఇక తాజా ఎన్ఎఫ్సీ పేమెంట్ విధానం కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫోన్ను ట్యాప్ చేస్తే చాలు ఇట్టే బిల్ పేమెంట్ జరిగేది. అయితే ఇప్పుడు తాజాగా మరో అద్భుతమైన పేమెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. చైనాలో ఇప్పటికే ఈ కొత్త పేమెంట్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్, బ్యాంకు కార్డులతో పని లేకుండా కేవలం అరచేతిని స్కాన్ చేస్తే చాలు పేమెంట్ అవుతుంది.
ప్రస్తుతం ఈ కొత్త టెక్నాలజీకి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రానా హంజా సైఫ్ అనే ఓ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో ఔరా అనిపించేలా ఉంది. చైనాలోని ఓ సూపర్ మార్కెట్కు వెళ్లిన యువకులు ముందుగా కొన్ని వస్తువులు కొనుగోలు చేశారు. అనంతరం పేమెంట్ చేసే విషయానికి రాగానే.. అక్కడే మూడు పేమెంట్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
వీటిలో ఒకటి యూపీఐ స్కానర్, మరొకటి ఎన్ఎఫ్సీ విధానం.. ఇక మూడోది అరచేతితో స్కాన్ చేసే డివైజ్ ఇలా మూడు అందుబాటులో ఉన్నాయి. అరచేతి స్కాన్ చేసే చోట చేయి పెట్టగానే.. ఇట్టే పేమెంట్ అయిపోయింది. ఇందుకోసం ఇంటర్నెట్ ఉండాల్సిన పని కూడా లేదు. ఈ కొత్త పేమెంట్ విధానం కోసం ముందుగా బ్యాంకులో అకౌంట్కు, అరచేతికి స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఎక్కడైనా స్కాన్ చస్తే సరిపోతుంది. మరి ఈ పేమెంట్ విధానం భారత్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..