ఆన్ లైన్ మోసాల రూటు రోజురోజుకీ మారుతోంది. కొత్త తరహాలో నేరాలు వెలుగుచూస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీకి పెను సవాళ్లు విసురుతున్నాయి. ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. నేరగాళ్లు ఏదో ఒక రకంగా చొరబడుతూనే ఉంటున్నారు. ఇప్పుడు రైల్వే టికెట్ల రీఫండ్ పేరుతో కొత్త స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. టికెట్ల రీఫండ్ విషయంలో సహాయం చేస్తామని గూగుల్ యాడ్స్ ద్వారా ప్రచారం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్వయంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) తన వినియోగదారులకు ఓ హెచ్చరిక నోటీసును విడుదల చేసింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే సైబర్-సేఫ్టీ అండ్ సైబర్సెక్యూరిటీ అవేర్ నెస్ ఇనిషియేటివ్ అయిన సైబర్ దోస్ట్ కూడా ఇదే విషయాన్ని హెచ్చరించింది. సైబర్ దోస్ట్ హ్యాండిల్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫారంలో దీనికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఐఆర్సీటీసీ తన వినియోగదారులకు విడుదల చేసిన నోట్లో టికెట్ రీఫండ్ల సాకుతో జరుగుతున్న ఆన్లైన్ ఆర్థిక మోసాల ట్రెండ్ గురించి వివరించింది. టికెట్ల రీఫండ్ విషయంలో సహాయం చేస్తామని గూగుల్ యాడ్స్ ద్వారా ప్రచారం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఆర్సీటిసీ వినియోగదారుల వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఎప్పుడూ అడగదని లేదా ఏనీ డెస్క్(Anydesk) లేదా టీమ్ వ్యూయర్(TeamViewer) వంటి రిమోట్ కంట్రోల్ యాప్లను ఇన్స్టాల్ చేయమని డిమాండ్ చేయదని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో ఐఆర్సీటీసీ నోటీసు కొన్ని కీలక అంశాలకు సంబంధించి వినియోగదారులను హెచ్చరించింది. భారతీయ రైల్వేలు లేదా దాని ఉద్యోగులు రీఫండ్ సమస్యల గురించి వినియోగదారులకు ఎప్పుడూ ఫోన్ కాల్స్ చేయరని తెలియజేసింది. ప్రభుత్వ రంగ సంస్థ వినియోగదారులను ఓటీపీ, డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు, సీవీవీ, ఏటీఎం పిన్, పాన్ నంబర్ లేదా పుట్టిన తేదీ వంటి వారి వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని షేర్ చేయమని ఎప్పుడూ అడగదని, అందువల్ల వినియోగదారులు ఈ వివరాలను ఎప్పుడూ షేర్ చేయకూడదని కూడా ఆ నోటీసులో పేర్కొంది.
వినియోగదారులు తమ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో ఎలాంటి రిమోట్ కంట్రోల్ అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయవద్దను సూచించింది. అలాగే ఐఆర్సీటీసీ రీఫండ్ల ప్రక్రియను సులభతరం చేస్తామంటూ కొన్ని గూగుల్ యాడ్స్ వస్తున్నాయని.. వీటి ద్వార ఆన్లైన్ ఫైనాన్షియల్ స్కామ్లు జరుగుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..