
Womens Kabaddi World Cup: భారత మహిళల కబడ్డీ జట్టు మరోసారి సత్తా చాటింది. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో చైనీస్ తైపీ జట్టుపై అద్భుత విజయం సాధించి, వరుసగా రెండోసారి ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత మహిళల జట్టు కబడ్డీలో తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.
ఢాకాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు 35-28 తేడాతో చైనీస్ తైపీని ఓడించింది. మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగినప్పటికీ, భారత క్రీడాకారిణుల వ్యూహాత్మక ఆటతీరుతో విజయం వరించింది.
ఈ టోర్నమెంట్ ఆసాంతం భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్లో ఇరాన్పై 33-21 తేడాతో గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. చైనీస్ తైపీ కూడా గ్రూప్ దశలో అజేయంగా నిలిచి, సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్కు చేరింది.
భారత మహిళల కబడ్డీ జట్టుకు ఇది వరుసగా రెండో ప్రపంచకప్ టైటిల్. 2012లో పాట్నాలో జరిగిన మొదటి ప్రపంచకప్లో కూడా భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంపై హర్యానా స్టీలర్స్ హెడ్ కోచ్ మన్ప్రీత్ సింగ్, పుణేరి పల్టన్ హెడ్ కోచ్ అజయ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. మహిళల జట్టు ప్రదర్శన దేశానికి గర్వకారణమని కొనియాడారు.
ఈ విజయంతో మహిళల కబడ్డీలో భారత్ శక్తి సామర్థ్యాలు మరోసారి ప్రపంచానికి తెలిశాయి. భవిష్యత్తులో కూడా ఈ విజయ పరంపర కొనసాగాలని ఆశిద్దాం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..