Video: IML T20 ఫైనల్‌లో గొడవ! కోపంతో ఊగిపోయిన యువరాజ్‌ సింగ్‌..

|

Mar 17, 2025 | 12:47 PM

ఇండియా మాస్టర్స్ జట్టు 2025 ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నమెంట్ ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్ పై విజయం సాధించింది. సచిన్ టెండూల్కర్ నాయకత్వంలో ఆడిన భారత జట్టు, వెస్టిండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని సులభంగా అందుకుంది. అయితే, యువరాజ్ సింగ్ మరియు టినో బెస్ట్ మధ్య జరిగిన వాగ్వాదం ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Video: IML T20 ఫైనల్‌లో గొడవ! కోపంతో ఊగిపోయిన యువరాజ్‌ సింగ్‌..
Yuvraj Singh Vs Tino Best
Follow us on

ఇంటర్నేషనల్‌ మాస్టర్స్ లీగ్‌ టీ20 2025లో భాగంగా ఆదివారం ఇండియా మాస్టర్స్‌, వెస్టిండీస్‌ మాస్టర్స్‌ జట్లు ఫైనల్‌లో తలపడ్డాయి. సచిన్‌ కెప్టె్న్సీలోని ఇండియా మాస్టర్స్ జట్టు విజయం సాధించి.. ఛాంపియన్‌గా అవతరించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ వివాదం చోటు చేసుకుంది. భారత దిగ్గజ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌, వెస్టిండీస్‌ ఆటగాడు టినో బెస్ట్‌ మధ్య ఈ వివాదం జరిగింది. టీమిండియా బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మధ్యలో వెస్టిండీస్ మాస్టర్స్‌ కెప్టెన్‌ బ్రియన్‌ లారా జోక్యం చేసుకొని.. ఇద్దరు ఆటగాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఇద్దరు కొద్ది సేపు వాదులాడుకున్నారు.

టినో బెస్ట్‌ అంపైర్‌తో మాట్లాడుతున్న క్రమంలో ఈ వాగ్వాదం జరిగింది. వీరి గొడవకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్‌ డెవాన్‌ స్మిత్‌ 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 45 పరుగులు చేసి రాణించాడు. అలాగే సిమోన్స్‌ సైతం 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 57 పరుగులు చేసి అదరగొట్టాడు. వీరిద్దరూ మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో విండీస్‌ తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ అయింది.

ఇండియా మాస్టర్స్ బౌలర్లలో వినయ్‌ కుమార్‌ 3, నదీమ్‌ 2, నేగి, బిన్నీ చెరో వికెట్‌ తీసుకున్నారు. ఇక 149 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా మాస్టర్స్‌ జట్టు 17.1 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఊదిపారేసింది. ఓపెనర్‌ అంబటి రాయుడు 50 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 74 పరుగులు చేసి మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్‌ సచిన్‌ టెండూల్కర్‌ 25, గుర్‌కీరత్‌ సింగ్‌ మాన్‌ 14, యూసుఫ్‌ పఠాన్‌ 0 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. యువరాజ్‌ సింగ్‌ 13, స్టువర్ట్‌ బిన్నీ 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఒక్కడ క్లిక్ చేయండి.