IPL 2026 : మార్చి 28 నుంచి ఐపీఎల్ జాతర.. వరల్డ్ కప్ గెలిచిన మనోళ్లు ఎవరెవరు ఏ జట్లలో ఉన్నారో తెలుసా ?

IPL 2026 : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత ఆటగాళ్లందరూ ఏయే జట్ల తరపున ఆడుతున్నారో, సంజూ శాంసన్ టీమ్ ఎందుకు మారిందో తెలుసుకుందాం. టీమిండియాను ప్రపంచ విజేతగా నిలిపిన 15 మంది ఆటగాళ్లలో దాదాపు అందరూ తమ పాత జట్లకే పరిమితమయ్యారు.

IPL 2026 : మార్చి 28 నుంచి ఐపీఎల్ జాతర.. వరల్డ్ కప్ గెలిచిన మనోళ్లు ఎవరెవరు ఏ జట్లలో ఉన్నారో తెలుసా ?
Ipl 2026

Updated on: Mar 23, 2026 | 8:20 PM

IPL 2026 : మార్చి 8వ తేదీన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆ విజయోత్సాహం ఇంకా తగ్గకముందే, సరిగ్గా మూడు వారాల వ్యవధిలోనే మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 (IPL 2026) సందడి మొదలుకాబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య తొలి పోరు జరగనుంది. అయితే, భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన మన ప్రపంచ విజేతలు ఈసారి ఐపీఎల్‌లో ఏ జట్టు తరపున ఆడుతున్నారు? వారిలో ఎవరి జట్లు మారాయి? అన్న ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం.

వరల్డ్ కప్ హీరోలు.. ఎవరెక్కడ?

భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన 15 మంది ఆటగాళ్లలో దాదాపు అందరూ తమ పాత జట్లకే పరిమితమయ్యారు. ముంబై ఇండియన్స్ తరపున సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా తమ సత్తా చాటనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఈసారి సంజూ శాంసన్‌తో పాటు శివం దూబే కనిపిస్తారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఆ జట్టుకు ప్రధాన బలంగా మారనున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగుతుండగా, గుజరాత్ టైటాన్స్ జట్టులో వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తమ స్పిన్ మ్యాజిక్ చూపించనుండగా, పంజాబ్ కింగ్స్ జట్టులో అర్ష్‌దీప్ సింగ్ ఏకైక వరల్డ్ కప్ విజేతగా నిలిచారు.

సంజూ శాంసన్ ఒక్కడే మారాడు

వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఉన్న 15 మందిలో 14 మంది తమ పాత టీమ్స్‌లోనే ఉండగా, కేవలం సంజూ శాంసన్ మాత్రమే తన జట్టును మార్చుకున్నారు. రాజస్థాన్ రాయల్స్‌ను వదిలి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరడం ఈ సీజన్ లోనే పెద్ద సెన్సేషన్. ఒక భారీ ట్రేడ్ డీల్‌లో భాగంగా సంజూ చెన్నైకి వెళ్లగా, ఆయన స్థానంలో రవీంద్ర జడేజా, సామ్ కరన్ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చారు. ధోనీ వారసుడిగా సంజూ చెన్నై పగ్గాలు అందుకుంటాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మార్పు రాజస్థాన్ జట్టుకు కూడా కొత్త ఈక్వేషన్స్ మోసుకొచ్చింది.

కెప్టెన్లుగా ముగ్గురు ఛాంపియన్లు

వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ ఈసారి ఐపీఎల్‌లో కెప్టెన్లుగా కనిపిస్తారు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను నడిపిస్తుండగా, అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహిస్తున్నారు. ఇక ఇషాన్ కిషన్ విషయానికొస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా తొలి కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడంతో, తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ముగ్గురు ప్రపంచ విజేతలు సారథులుగా వ్యవహరించడం ఈ సీజన్ కు మరింత వన్నె తెచ్చింది.

ఆరంభ పోరులో ముఖాముఖి

ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లోనే ఇద్దరు వరల్డ్ కప్ హీరోలు తలపడబోతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మైదానంలోకి దిగనున్నారు. మరోవైపు ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ (వరల్డ్ కప్ 2026 జట్టులో లేనప్పటికీ) కూడా మైదానంలో ఉండటంతో తొలి రోజే ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయం. ప్రపంచ ఛాంపియన్ల మధ్య జరిగే ఈ లీగ్ పోరుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us