
Women AP Premier League 2026: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) క్రీడా రంగంలో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఉమెన్ ఏపీఎల్ (Women AP Premier League – WAPL) సీజన్-1 టోర్నమెంట్ అధికారికంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని అత్యాధునిక స్టేడియంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుక క్రీడా ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వేడుకలో పాల్గొన్న నారా బ్రాహ్మణి (Nara Brahmani) స్వయంగా ఉమెన్ ఏపీఎల్ (Women AP Premier League) ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా క్రీడాకారిణులకు ఇదొక అద్భుతమైన వేదిక అని ప్రశంసించారు. ప్రతిభ ఉండి సరైన అవకాశాలు లభించని యువతకు ఈ టోర్నమెంట్ చక్కటి భవిష్యత్తును ఇస్తుందని, దక్కిన ప్రతి అవకాశాన్ని క్రీడాకారిణులు నమ్మకంతో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల మహిళలకు ఈ వేదిక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ అట్టహాస వేడుకలో విజయవాడ ఎంపీ అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association – ACA) అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్, గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణరంగారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే సినీ నటి స్నిగ్ధ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ గాయకులు హేమచంద్ర , గీతా మాధురి తమ మధురమైన పాటలతో మైదానంలో ఉన్న ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలతో స్టేడియం మొత్తం కోలాహలంగా మారింది.
ఈ టోర్నమెంట్లో భాగంగా ఉమెన్ ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (Women Andhra Premier League) సీజన్-1 తొలి మ్యాచ్లో అమరావతి ఈగల్ ఛాంపియన్స్ (Amaravati Eagle Champions), వైజాగ్ ఫైర్బర్డ్స్ (Vizag Firebirds) జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మహిళా క్రికెట్ను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన ఈ లీగ్ మ్యాచ్లు రాబోయే రోజుల్లో మరింత రసవత్తరంగా సాగనున్నాయి.
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ డబ్ల్యూఏపీఎల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఫ్రాంచైజీ విధానంలో రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న డబ్ల్యూఏపీఎల్ టీ-20 క్రికెట్ పోటీల్లో నాలుగు జట్లు రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్, అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ తలపడనున్నాయి. మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో 7 రోజుల పాటు 13 మ్యాచ్ లు జరగనున్నాయి. శనివారం మధ్యాహ్నం రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరిగింది. సాయంత్రం అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది.