
భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్ల్లో విఫలం అయ్యాడు. అలాగే అభిషేక్ శర్మ కూడా నాలుగో టీ20లో ఫెయిల్ అయ్యాడు. వైభవ్, అభిషేక్ ఓపెనింగ్ జోడీ పేపర్పై స్ట్రాంగ్గా కనిపిస్తున్నా.. గ్రౌండ్లో మాత్రం ఇప్పటి వరకు తమ ప్రతాపం చూపలేకపోయింది. దీంతో బీసీసీఐ వారిద్దరికీ కీలక సందేశం ఇచ్చినట్లు సమాచారం. కేవలం 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ తన తొలి మూడు టీ20 ఇన్నింగ్స్లలో 13, 15, 14 పరుగులే చేశాడు. మొత్తం 42 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, ఐదు భారీ సిక్సర్లు బాది తన సహజమైన దూకుడు ఆటను ప్రదర్శించాడు. అయితే ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు, 237కు పైగా స్ట్రైక్రేట్తో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న స్థాయికి తగిన ప్రదర్శన మాత్రం అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా కనిపించలేదు.
ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టీ20లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోవడంతో సిరీస్ను కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల సిక్సర్లు కొట్టే సామర్థ్యం అద్భుతమే. కానీ ఆ దూకుడును పరిస్థితులకు అనుగుణంగా నియంత్రించడం కూడా నేర్చుకోవాలి అని బీసీసీఐ వర్గాలు అభిప్రాయపడినట్లు సమాచారం. సూర్యవంశీ ఇప్పటికే 15 ఏళ్ల 99 రోజుల వయసులో భారత తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచి, సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఐపీఎల్లో అతని ప్రదర్శన కూడా అసాధారణమే. ఇప్పటివరకు 23 మ్యాచ్ల్లో 1,028 పరుగులు, రెండు సెంచరీలు, ఆరు అర్ధశతకాలు, 96 సిక్సర్లతో అతను తన ప్రతిభను నిరూపించాడు.
ఇదిలా ఉండగా వైభవ్కు అవకాశం కల్పించేందుకు సంజు శాంసన్ను పక్కన పెట్టడంపై భారత మాజీ వికెట్కీపర్ పార్థివ్ పటేల్ విమర్శలు చేశారు. గత 11-12 ఏళ్లుగా సంజు నిలకడలేమి కారణంగానే విమర్శలు ఎదుర్కొంటున్నాడని, అయితే కేవలం భావోద్వేగాల ఆధారంగా కాకుండా తార్కికంగా కూడా ఎంపికలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. వైభవ్కు అవకాశం ఇవ్వడం సరైనదే. కానీ సంజును ఎందుకు తప్పించారనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఉండాలి అని పార్థివ్ వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రపంచ నంబర్-2 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ కూడా సిరీస్లో నిలకడగా రాణించలేకపోయాడు. తొలి రెండు మ్యాచ్ల్లో 59, 43 పరుగులు చేసిన అతడు, తర్వాతి రెండు ఇన్నింగ్స్ల్లో 10, 16 పరుగులకే పరిమితమయ్యాడు. భారీ షాట్లు ఆడే సామర్థ్యం ఇద్దరిలోనూ ఉన్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలంటే దూకుడుతో పాటు పరిస్థితులకు తగ్గట్టు ఇన్నింగ్స్ను నిర్మించే నైపుణ్యం కూడా అవసరమని బీసీసీఐ పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి