IND vs NZ: బెంగుళూరు టెస్టు వర్షంతో రద్దయితే.. భారీగా నష్టపోనున్న టీమిండియా?

|

Oct 17, 2024 | 11:10 AM

WTC Final: బెంగుళూరు టెస్టులో కివీస్‌తో ఢీ కొంటోన్న భారత్.. మిగిలిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించాల్సి ఉంది. అప్పుడే భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంటుంది. కానీ, ఈ పరిస్థితిలో రోహిత్ జట్టు ఇతర జట్ల ఫలితాలను కూడా పర్యవేక్షించాల్సి ఉంది.

IND vs NZ: బెంగుళూరు టెస్టు వర్షంతో రద్దయితే.. భారీగా నష్టపోనున్న టీమిండియా?
Ind Vs Nz Wtc Final
Follow us on

Team India WTC Final Qualification Scenario: భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ఈరోజు నుంచి అంటే అక్టోబర్ 16న బెంగళూరులో ప్రారంభం కానుంది. కానీ, వర్షం కారణంగా తొలిరోజు టెస్టు రద్దయింది. అలాగే, మిగిలిన నాలుగు రోజుల టెస్టులో వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరు టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిస్తే.. టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు గట్టి పోటీదారుగా ఉన్న టీమిండియా.. తొలి టెస్టు డ్రా తర్వాత మరిన్ని ఎదురు దెబ్బలు తగలనున్నాయి.

బెంగళూరు టెస్టు డ్రా అయితే ఏమవుతుంది?

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ డ్రా అయితే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఉన్న టీమిండియాకు పాయింట్ల పరంగా భారీ దెబ్బ తగలనుంది. నిజానికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కింద టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు 12 పాయింట్లు ఇస్తారు. టై అయితే, రెండు జట్లకు 6 పాయింట్లు ఇస్తారు. అలాగే, మ్యాచ్ డ్రాగా ముగిస్తే ఇరు జట్లకు 4 పాయింట్లు చొప్పున కేటాయిస్తారు. అందువల్ల బెంగళూరు టెస్టు డ్రాగా ముగిస్తే టీమిండియాకు కేవలం 4 పాయింట్లు మాత్రమే దక్కుతాయి.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రస్తుత మూడవ ఎడిషన్‌లో, టీమ్ ఇండియా ఇప్పటివరకు మొత్తం 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా, అందులో 8 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌లు ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. ఈ ప్రదర్శనతో రోహిత్ సేన 74.24 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా విజయ శాతం 62.50గా ఉంది. ఇది భారత్‌ కంటే కొంచెం వెనుకబడి ఉంది. మూడో స్థానంలో ఉన్న శ్రీలంక 55.56 విజయాల శాతంతో ఉండగా, ఇంగ్లండ్ 45.59 విజయ శాతంతో నాలుగో స్థానంలో ఉంది.

4 మ్యాచ్‌లు గెలిస్తే ఫైనల్‌కు వెళ్లే మార్గం సుగమం..

ఇప్పుడు వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో ఆడాలంటే రోహిత్ జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. బెంగళూరు టెస్టుతో పాటు భారత్ ఇంకా 7 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో రెండు మ్యాచ్‌లు న్యూజిలాండ్‌తో స్వదేశంలో, మిగిలిన ఐదు మ్యాచ్‌లు ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతాయి. రోహిత్ సేన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ను ఓడించగలిగితే, ఆస్ట్రేలియాపై కనీసం రెండు మ్యాచ్‌లైనా గెలవాల్సి ఉంటుంది. టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌లు గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు సులభంగా అర్హత సాధిస్తుంది.

మూడు టెస్టులు గెలిచే అవకాశం..

బెంగళూరు టెస్టు మినహా మిగిలిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధిస్తే భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంటుంది. కానీ, ఈ పరిస్థితిలో రోహిత్ జట్టు ఇతర జట్ల ఫలితాలపై కూడా ఓ కన్నేసి ఉంచాలి. ఎందుకంటే, ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న శ్రీలంక భారత్‌కు అతిపెద్ద పోటీదారుగా దూసుకొస్తోంది. తదుపరి టెస్టు సిరీస్‌లో శ్రీలంక దక్షిణాఫ్రికాతో తలపడనున్నాయి. ప్రస్తుతం లంక ఫామ్ చూస్తుంటే ఆఫ్రికా జట్టును ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేస్తున్న ఇంగ్లండ్‌పై టీమిండియా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి, మరో జట్టు ఫలితంపై ఆధారపడకుండా నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశించాలంటే టీమిండియా 4 మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..