Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా..  52 ఏళ్ల రికార్డు బద్దలు

Team India: మహిళల హాకీ ప్రపంచకప్‌ 2026లో టీమిండియా చరిత్ర సృష్టించింది. జర్మనీపై 3-1తో ఘన విజయం సాధించి ప్రపంచకప్‌లో ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. 52 ఏళ్ల తర్వాత భారత్ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. నవనీత్ కౌర్ రెండు గోల్స్‌తో మెరిసింది. 1974లో నాలుగో స్థానంలో నిలిచిన తర్వాత ఇదే భారత్‌కు ప్రపంచకప్‌లో రెండో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా..  52 ఏళ్ల రికార్డు బద్దలు
Team India

Updated on: Aug 28, 2026 | 7:26 AM

Team India: మహిళల హాకీ ప్రపంచకప్‌ 2026లో టీమిండియా సరికొత్త అధ్యాయం లిఖించింది. నెదర్లాండ్స్‌ వేదికగా జరిగిన వర్గీకరణ పోరులో జర్మనీపై 3-1 తేడాతో చారిత్రక విజయం సాధించింది. ఈ సంచలన విజయంతో 52 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ ప్రపంచకప్‌లో 5వ స్థానంతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఆగస్టు 27న నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టెల్‌వీన్ మైదానంలో జరిగిన ఐదో స్థానం క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచ హాకీలో బలమైన శక్తిగా పేరుగాంచిన జర్మనీని 3-1 తేడాతో ఓడించి ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది. 1974లో ప్రారంభమైన మహిళల ప్రపంచకప్ టోర్నీ చరిత్రలోనే భారత్‌కు ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన. తొలిసారి 1974లో నాలుగో స్థానంలో నిలిచిన భారత్, మళ్లీ ఐదు దశాబ్దాల సుదీర్ఘ సమయం తర్వాత ఆ స్థాయి ఘనతను మళ్లీ నమోదు చేసి చరిత్ర సృష్టించింది.

తొలి రెండు క్వార్టర్లలో తీవ్ర ఉత్కంఠ

పోటీ ప్రారంభం నుంచి ఇరు జట్లు ఆచితూచి ఆడటంతో మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా సాగింది. తొలి 15 నిమిషాల మొదటి క్వార్టర్ తీవ్ర హోరాహోరీగా సాగినప్పటికీ ఏ జట్టు కూడా గోల్ కొట్టలేకపోయింది. రెండో క్వార్టర్‌లోనూ ఇరు జట్ల రక్షణ దళాలు గట్టి పోటీనిచ్చాయి. జర్మనీకి కొన్ని పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ భారత డిఫెండర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. జర్మనీ క్రీడాకారిణి సోన్యా జిమర్‌మాన్‌కు గ్రీన్ కార్డ్ లభించడంతో ఉద్రిక్తత పెరిగింది. ఆట సగం పూర్తయ్యేసరికి స్కోరు 0-0తో సమంగా నిలిచింది.

చివరి 17 నిమిషాల్లో భారత్ ధనధన్ ఆట

మూడో క్వార్టర్ ఆఖరి నిమిషాల్లో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 43వ నిమిషంలో భారత ప్లేయర్ ఇషిక అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆ ఆనందం ముగియక ముందే, తదుపరి 44వ నిమిషంలో నవనీత్ కౌర్ మెరుపు వేగంతో రెండో గోల్ సాధించింది. మూడు క్వార్టర్లు ముగిసేసరికి భారత్ 2-0తో స్పష్టమైన ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది.

నవనీత్ డబుల్ ధమాకా

చివరి క్వార్టర్ ప్రారంభమైన వెంటనే భారత్ ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి పెంచింది. 47వ నిమిషంలో నవనీత్ కౌర్ వ్యక్తిగతంగా రెండో గోల్ సాధించడంతో భారత్ 3-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ ఆఖరి ఘట్టంలో 59వ నిమిషంలో జర్మనీ క్రీడాకారిణి లిన్ క్రింగ్స్ ఏకైక గోల్ చేసి ఓటమి భారాన్ని తగ్గించుకుంది. పూర్తి సమయం ముగిసేసరికి భారత్ 3-1తో విజయం సాధించి 5వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us