Surya kumar Yadav : ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న సూర్య..వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన కెప్టెన్..కోహ్లీ రికార్డ్ బ్రేక్

Surya kumar Yadav : టీ20 ప్రపంచకప్ 2026 ఆరంభ మ్యాచ్‌లోనే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాపై జరిగిన ఉత్కంఠ పోరులో అజేయంగా 84 పరుగులు చేసిన సూర్య, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

Surya kumar Yadav : ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న సూర్య..వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన కెప్టెన్..కోహ్లీ రికార్డ్ బ్రేక్
Suryakumar Yadav

Updated on: Feb 08, 2026 | 7:13 AM

Surya kumar Yadav : టీ20 ప్రపంచకప్ 2026 ఆరంభ మ్యాచ్‌లోనే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాపై జరిగిన ఉత్కంఠ పోరులో అజేయంగా 84 పరుగులు చేసిన సూర్య, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కింగ్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న భారీ రికార్డును బద్ధలు కొట్టి, భారత్ తరపున అత్యధిక సార్లు ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు.

అమెరికాపై జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఇది 17వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. దీంతో 16 అవార్డులతో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీని ఆయన వెనక్కి నెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కోహ్లీ 125 మ్యాచ్‌ల్లో 16 సార్లు ఈ ఘనత సాధిస్తే, సూర్య కేవలం 105 మ్యాచ్‌ల్లోనే 17 సార్లు అవార్డులు గెలుచుకుని తన స్ట్రైక్ రేట్‌ను చాటుకున్నాడు.

టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక POTM అవార్డులు (భారత్):

సూర్యకుమార్ యాదవ్: 17 (105 మ్యాచ్‌లు)

విరాట్ కోహ్లీ: 16 (125 మ్యాచ్‌లు)

రోహిత్ శర్మ: 14 (159 మ్యాచ్‌లు)

యువరాజ్, రోహిత్‌లను పక్కకు నెట్టి..

టీ20 ప్రపంచకప్ చరిత్రను పరిశీలిస్తే, అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన భారత ఆటగాళ్ల జాబితాలో సూర్య ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ముగ్గురు అవార్డులతో ఉన్న యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్లను ఆయన అధిగమించాడు. 8 అవార్డులతో విరాట్ కోహ్లీ ఇంకా అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ, సూర్య తన వేగంతో ఆ దిశగా దూసుకుపోతున్నాడు.

ఒంటరి పోరాటం.. చారిత్రక విజయం

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఒకానొక దశలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పసికూన అమెరికా చేతిలో ఓడిపోతుందన్న భయం అభిమానుల్లో నెలకొన్న సమయంలో కెప్టెన్ సూర్య బాధ్యతాయుతంగా ఆడాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లలో గేర్ మార్చి టీమ్ స్కోరును 161 పరుగులకు చేర్చాడు. అనంతరం భారత బౌలర్లు అమెరికాను 132 పరుగులకే కట్టడి చేసి 29 పరుగుల విజయాన్ని ఖరారు చేశారు.