
IND vs SL: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఆగస్టు 15 నుంచి ఇరు జట్ల మధ్య 2 మ్యాచ్ల కీలక టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే శ్రీలంక క్రికెట్ బోర్డుకు పెద్ద షాక్ తగిలింది. తమ మాజీ హెడ్ కోచ్ చండిక హతురుసింగేతో కాంట్రాక్ట్ రద్దు విషయంలో నడుస్తున్న చట్టపరమైన వివాదాన్ని పరిష్కరించుకోవడానికి శ్రీలంక క్రికెట్ ఏకంగా 1,64,000 అమెరికన్ డాలర్లను (భారత కరెన్సీలో సుమారు రూ. 1.56 కోట్లు) సెటిల్మెంట్ కింద చెల్లించాల్సి వచ్చింది.
ఏళ్ల తరబడి నడిచిన వివాదం
సండే టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ సెటిల్మెంట్ చెల్లింపు తర్వాత చండిక హతురుసింగే స్విట్జర్లాండ్లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్లో శ్రీలంక క్రికెట్పై వేసిన చట్టపరమైన పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి అంగీకరించారు. మొదట కాంట్రాక్ట్ను మధ్యలోనే ముగించినందుకు హతురుసింగే శ్రీలంక బోర్డు నుంచి దాదాపు 50 లక్షల అమెరికన్ డాలర్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేశారు. అయితే సీఏఎస్లో కేసు ఆయన ఊహించినట్లుగా సాగకపోవడంతో, తర్వాత 4,50,000 డాలర్ల నష్టపరిహారాన్ని కోరుతూ కొత్తగా న్యాయపోరాటం ప్రారంభించారు.
వివాదానికి తెరదించిన సెటిల్మెంట్ ఒప్పందం
ఈ వివాదాన్ని ఎట్టకేలకు పరిష్కరించడానికి ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన చర్చల్లో హతురుసింగే 2,00,000 డాలర్లు తీసుకోవడానికి అంగీకరించగా, చివరికి ఈ కేసును పూర్తిగా ముగించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఆయనకు 1,64,000 డాలర్లు చెల్లించి వివాదానికి చుక్కెడు పెట్టింది. దీంతో బోర్డుకు కోట్లాది రూపాయల ఆర్థిక భారం తప్పలేదు.
వివాదాస్పదంగా మారిన హతురుసింగే పదవీకాలం
చండిక హతురుసింగే డిసెంబర్ 8, 2017న శ్రీలంక జాతీయ జట్టు హెడ్ కోచ్గా నియమితులయ్యారు. ఆయన హయాంలో శ్రీలంక జట్టు ఆడిన 67 అంతర్జాతీయ మ్యాచ్లలో 24 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచి, 38 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఆయన పదవీకాలం తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఒక అంతర్గత విచారణలో ఆయనపై ఆటగాళ్లను సరిగ్గా సిద్ధం చేయకపోవడం, జట్టులో విభేదాలు సృష్టించడం వంటి 6 ప్రధాన ఆరోపణలు రుజువు కావడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..