Sourav Ganguly : బెంగాల్ క్రికెట్‌లో ముదురుతున్న వివాదం.. సౌరవ్ గంగూలీపై అవినీతి ఆరోపణలు

Sourav Ganguly : బెంగాల్ క్రికెట్‌లో కొత్త వివాదం చెలరేగింది. మాజీ అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా చేసిన అవినీతి ఆరోపణలను క్యాబ్ తీవ్రంగా ఖండించింది. సౌరవ్ గంగూలీ నిజాయితీపై ఎలాంటి మచ్చ లేదని స్పష్టం చేస్తూ, ఆరోపణలు నిరాధారమని బోర్డు పేర్కొంది.

Sourav Ganguly : బెంగాల్ క్రికెట్‌లో ముదురుతున్న వివాదం.. సౌరవ్ గంగూలీపై అవినీతి ఆరోపణలు
Sourav Ganguly

Updated on: Jun 18, 2026 | 6:33 PM

Sourav Ganguly : క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB)లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాయి. సెప్టెంబర్ లో జరగబోయే బోర్డు వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం కంటే ముందే అసోసియేషన్‌లో తీవ్ర రాజకీయాలు మొదలయ్యాయి. క్యాబ్ మాజీ అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా.. ప్రస్తుత బోర్డు అడ్మినిస్ట్రేషన్, సౌరవ్ గంగూలీపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు, సెలెక్షన్ లలో పారదర్శకత లోపించిందంటూ ఆరోపణలు గుప్పించారు. బెంగాల్ క్రికెట్ బోర్డు పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆరోపిస్తూ ఆయన రాష్ట్ర క్రీడా విభాగపు యాంటీ కరప్షన్ హెల్ప్‌లైన్‌కు దర్యాప్తు చేయాలని కోరుతూ లేఖ రాయడం సంచలనంగా మారింది.

అభిషేక్ దాల్మియా ఆరోపణలను తోసిపుచ్చిన క్యాబ్

అభిషేక్ దాల్మియా చేసిన ఈ తీవ్రమైన వ్యాఖ్యలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అఫీషియల్‌గా తోసిపుచ్చింది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ ఇంద్రనీల్ ఖాన్‌కు బోర్డు మూడు పేజీల సుదీర్ఘమైన వివరణాత్మక లేఖను పంపింది. తమ పరిపాలన ఎంతో పారదర్శకంగా సాగుతోందని, బోర్డులో ఎలాంటి అవినీతి లేదని అందులో పేర్కొంది. ఈ లేఖపై స్వయంగా సౌరవ్ గంగూలీతో పాటు బోర్డు సెక్రటరీ బబ్లూ కోలే, ఇతర కీలక సభ్యులంతా సంతకాలు చేయడం విశేషం. బోర్డు అంతర్గత విషయాలను చర్చించకుండా ఇలా బహిరంగంగా లేఖలు రాయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని వారు ప్రశ్నించారు.

గంగూలీపై ఒక్క ఆరోపణ కూడా లేదు

సౌరవ్ గంగూలీ క్లీన్ ఇమేజ్‌ను ఈ లేఖలో బోర్డు గట్టిగా సమర్థించింది. గంగూలీ భారత జట్టుకు కెప్టెన్‌గా, క్యాబ్ అధ్యక్షుడిగా, బీసీసీఐ ప్రెసిడెంట్‌గా, ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో ఉన్నతమైన పదవులను అలంకరించారని గుర్తు చేసింది. అంతటి సుదీర్ఘమైన క్రీడా, పరిపాలనా ప్రస్థానంలో గంగూలీ ఎప్పుడూ కూడా తన నిజాయితీపై ఒక్క మచ్చ కూడా రానివ్వలేదని లేఖలో స్పష్టం చేశారు. అలాంటి లెజెండరీ క్రికెటర్ పై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం వెనుక కేవలం ప్రచార యావ మాత్రమే ఉందని బోర్డు మండిపడింది.

న్యాయవ్యవస్థను పక్కనబెట్టడంపై ఆగ్రహం

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పడిన లోధా సంస్కరణల ద్వారా ప్రతి క్రికెట్ బోర్డులో అంబడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ వ్యవస్థ అందుబాటులో ఉంటుందని క్యాబ్ గుర్తు చేసింది. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన విషయాలను హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయ్ భట్టాచార్య పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా ఈ లీగల్ ఫోరమ్ ముందు ఉంచితే పూర్తి పారదర్శకంగా విచారణ జరుగుతుందని.. అభిషేక్ దాల్మియాకు కూడా ఈ విషయాలన్నీ బాగా తెలుసని బోర్డు పేర్కొంది. ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని వ్యవస్థను పక్కనబెట్టి, ఇలా ప్రచారం కోసం పబ్లిక్ గా లేఖలు రాయడం కరెక్ట్ కాదని హితవు పలికింది.

గత మూడు దశాబ్దాల రికార్డులను గుర్తు చేసిన బోర్డు

అభిషేక్ దాల్మియా 2022 వరకు క్యాబ్ సెక్రటరీగా, ప్రెసిడెంట్‌గా పనిచేశారని, ఆ సమయంలో ఆయనకు లేని అవినీతి ఇప్పుడే ఎలా కనిపిస్తోందని బోర్డు ఎద్దేవా చేసింది. గత మూడు దశాబ్దాలుగా బి.ఎన్.దత్, జగ్‌మోహన్ దాల్మియా, సౌరవ్ గంగూలీ వంటి మహామహులు ఈ బోర్డును ఎంతో దిగ్విజయంగా నడిపించారని.. ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదని పేర్కొంది. కేవలం తన హయాంలో మాత్రమే అంతా బాగుందని, మిగతా అందరి కాలంలో తప్పులు జరిగాయని అభిషేక్ దాల్మియా చెప్పడం హాస్యాస్పదమని క్యాబ్ కొట్టిపారేసింది. ఈ లేఖ అసోసియేషన్‌లోని ప్రతి ఒక్కరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని బోర్డు వెల్లడించింది.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us