
Shreyas Iyer : ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన మూడవ వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ తీవ్ర గాయానికి గురైన స్టార్ ఇండియన్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, దాదాపు వారం రోజుల పాటు ఆసుపత్రిలో అందులో కొన్ని రోజులు ఐసీయూలో చికిత్స పొందారు. అక్టోబర్ 25న జరిగిన ఈ ప్రమాదం తర్వాత శ్రేయస్ అయ్యర్ తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఫస్ట్ ఫోటోను షేర్ చేశారు. ఆయనకు ఇంటర్నల్ బ్లీడింగ్ జరగడం, స్ప్లీన్ చిట్లడం వంటి తీవ్రమైన గాయాలు అయ్యాయని, సరైన సమయంలో గుర్తించకపోతే ప్రమాదం జరిగేదని వైద్యులు తెలిపారు.
అక్టోబర్ 25న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ వన్డేలో భారత వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తూ ప్రమాదకరమైన గాయానికి గురయ్యారు. అలెక్స్ కారీ క్యాచ్ పట్టిన సమయంలో శ్రేయస్ అయ్యర్ అడ్డంగా కిందపడటంతో, అతనికి వెంటనే నొప్పి మొదలైంది. అతన్ని మైదానం నుంచి నేరుగా ఆసుపత్రికి తరలించారు.
శ్రేయస్కు స్ప్లీన్ లాసెరేషన్ అనే అరుదైన గాయం అయినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇంటర్నల్ బ్లీడింగ్ ఆపడానికి అతనికి అత్యవసర శస్త్రచికిత్స కూడా జరిగింది. వైద్య సిబ్బంది సకాలంలో సమస్యను గుర్తించకపోతే ఈ గాయం ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉండేదని పలు నివేదికలు తెలిపాయి. శ్రేయస్ అయ్యర్ నవంబర్ 1న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు, కానీ ఆస్ట్రేలియా నుంచి ప్రయాణించడానికి వైద్య అనుమతి వచ్చేవరకు అక్కడే ఉన్నారు.
Monday couldn’t have ended better! ♥️#ShreyasIyer pic.twitter.com/55eQ4rc3v3
— Punjab Kings (@PunjabKingsIPL) November 10, 2025
సోమవారం (నవంబర్ 10) రోజున శ్రేయస్ అయ్యర్ తన ఇన్స్టాగ్రామ్లో గాయం తర్వాత తన ఫస్ట్ ఫోటో రిలీజ్ చేసి అభిమానులకు ఊరటనిచ్చారు. ఒక స్నేహితుడితో కలిసి బీచ్లో ఉన్న ఫోటో పోస్ట్ చేస్తూ.. “సూర్యరశ్మి గొప్ప చికిత్స. తిరిగి రావడం పట్ల కృతజ్ఞుడను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు” అని శ్రేయస్ క్యాప్షన్ రాశారు. తాను బాగానే ఉన్నానని, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని ఆయన తెలియజేశారు.
శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతారు అనే విషయంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న సౌతాఫ్రికా వన్డే సిరీస్కు శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉండే అవకాశం లేదు. వన్డే ఫార్మాట్లో భారత్ తదుపరి ఆడబోయే సిరీస్ జనవరిలో న్యూజిలాండ్తో ఉంటుంది. అప్పటికి శ్రేయస్ పూర్తిగా కోలుకుని జట్టులోకి తిరిగి వస్తారా అనేది చూడాలి.
శ్రేయస్ రెడ్-బాల్ (టెస్ట్) క్రికెట్కు దూరంగా ఉన్నప్పటికీ, టీ20 జట్టులో కూడా ప్రస్తుతం భాగం కావడం లేదు. అయితే, 2026 టీ20 ప్రపంచ కప్కు ముందు తిరిగి జట్టులోకి వచ్చి, తన స్థానాన్ని పదిలం చేసుకుంటారా అనేది అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..