Team India : టీమిండియా ఓటమికి కారణం ప్రాక్టీస్ లేకేనా? అశ్విన్ మాటల్లో ఎంత నిజముంది?
సౌతాఫ్రికా చేతిలో భారత క్రికెట్ జట్టు ఓటమి తర్వాత మాజీ క్రికెటర్లంతా జట్టు వ్యూహాలపై, ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సునీల్ గవాస్కర్, ఆర్ అశ్విన్, హర్భజన్ సింగ్, సౌరవ్ గంగూలీ లాంటి దిగ్గజాలు ఇప్పటికే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే తాజాగా సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు.

Team India : సౌతాఫ్రికా చేతిలో భారత క్రికెట్ జట్టు ఓటమి తర్వాత మాజీ క్రికెటర్లంతా జట్టు వ్యూహాలపై, ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సునీల్ గవాస్కర్, ఆర్ అశ్విన్, హర్భజన్ సింగ్, సౌరవ్ గంగూలీ లాంటి దిగ్గజాలు ఇప్పటికే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే తాజాగా సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను బ్యాటింగ్లో మూడో స్థానంలో పంపడం, కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం జట్టుకు ఘోరంగా నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని డీకే గట్టిగా హెచ్చరించారు.
క్రికెట్ నిపుణులతో మాట్లాడే క్రమంలో దినేష్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్ రోల్ గురించి ప్రస్తావించారు. ‘వాషింగ్టన్ సుందర్ ఒక టెస్ట్ ప్లేయర్. అసలు అతను బ్యాటింగ్ చేయగలిగే బౌలరా? లేక బౌలింగ్ చేయగలిగే బ్యాట్స్మనా?’ అని డీకే ప్రశ్నించారు. సుందర్ను బ్యాటింగ్ ఆర్డర్లో ఏకంగా నంబర్ 3 స్థానంలో పంపడం అనేది అతన్ని బ్యాటింగ్పై ఎక్కువ దృష్టి పెట్టమని చెప్పినట్లేనని కార్తీక్ అభిప్రాయపడ్డారు.
కార్తీక్ చెప్పిన దాని ప్రకారం.. ఒక ప్లేయర్ బ్యాటింగ్పై ఎక్కువ దృష్టి పెడితే, దాని ప్రభావం అతని బౌలింగ్ ప్రాక్టీస్పై పడుతుంది. సుందర్ ఎక్కువ సమయం బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం కేటాయించినప్పుడు దానంతటదే బౌలింగ్ ప్రాక్టీస్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఒకేసారి బ్యాటింగ్లో, బౌలింగ్లో అత్యుత్తమంగా ఉండటం అనేది శారీరకంగా చాలా కష్టం అని కార్తీక్ వివరించారు. ఈ విధంగా సుందర్ ఒక మంచి ఆల్రౌండర్గా కాకుండా అతని బౌలింగ్ నైపుణ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని కార్తీక్ హెచ్చరించారు. గౌతమ్ గంభీర్ ఈ నిర్ణయాన్ని వెంటనే మార్చుకోకపోతే, సుందర్ ఫామ్ దెబ్బతినడం ఖాయమని ఆయన పరోక్షంగా సూచించారు.
ఒకవైపు దినేష్ కార్తీక్ ఆటగాడి పాత్ర గురించి మాట్లాడితే మరో సీనియర్ ఆటగాడు ఆర్ అశ్విన్ టీమిండియా ప్రాక్టీస్ విధానంపైన పిచ్ తయారీపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పిన్కు అనుకూలించే పిచ్లను తయారు చేయడాన్ని అశ్విన్ తప్పుబట్టారు. గతంలో అమొల్ మజుందార్, మిథున్ మన్హాస్, సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాళ్లు కోల్కతా పిచ్లపై ఆడిన రోజుల్లో మ్యాచ్ను నాలుగో రోజు వరకు తీసుకెళ్లగలిగేవారని అశ్విన్ గుర్తు చేశారు.
అయితే ఇప్పుడున్న భారత బ్యాట్స్మెన్ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లపై సరిగా ఆడలేకపోతున్నారని, కాబట్టి అలాంటి పిచ్లను తయారు చేయడమే మానేయాలని అశ్విన్ సూచించారు. అంటే టీమిండియా ప్లేయర్స్ సరిగా ప్రాక్టీస్ చేయడం లేదని, వారికి కఠినమైన పరిస్థితుల్లో ఆడే నైపుణ్యం తగ్గిపోతోందనేది అశ్విన్ విమర్శల సారాంశం.
మొత్తం మీద సౌతాఫ్రికా చేతిలో ఓటమి అనేది భారత క్రికెట్ అభిమానులను మాత్రమే కాదు, మాజీ దిగ్గజాలను కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది. గౌతమ్ గంభీర్ వ్యూహాలు, ఆటగాళ్ల పాత్రలు, ప్రాక్టీస్ విధానం.. ఇలా అన్ని అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబోయే మ్యాచ్లలో టీమిండియా ఈ విమర్శలకు ఎలా సమాధానం చెబుతుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




