
IPL 2026 Final : ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మే 31న గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో గెలిచి ఆర్సీబీ కప్ కొట్టినా, ఆ జట్టు ఆటగాళ్ల ప్రవర్తన మాత్రం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తోంది. గెలిచిన జోష్లో కొందరు ప్లేయర్స్ హద్దులు దాటి ప్రవర్తించడమే కాకుండా, బీసీసీఐ నిబంధనలను బేఖాతరు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ క్లిప్లో ఆర్సీబీ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్, ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ భుజాలపై కూర్చుని ఐపీఎల్ ట్రోఫీ పట్టుకుని ఉన్నాడు. అయితే చుట్టూ తోటి ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా.. వీరిద్దరూ కెమెరా వైపు చూస్తూ అసభ్యకరమైన మిడిల్ ఫింగర్ హావభావాన్ని ప్రదర్శించారు. ఈ వీడియో బయటకు రావడంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ వెంటనే వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో టిమ్ డేవిడ్ కేవలం ఆటతోనే కాకుండా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. క్రమశిక్షణా రాహిత్యం కారణంగా ఈ సీజన్లో అతను ఏకంగా ఐదు డీమెరిట్ పాయింట్లను మూటగట్టుకున్నాడు. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ 2027 సీజన్ మొదటి మ్యాచ్ నుంచి అతనిపై ఆటోమేటిక్ వన్-మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. మైదానంలో పదే పదే రూల్స్ బ్రేక్ చేసినందుకు గానూ ఇప్పటికే అతను భారీగా జరిమానాలు కూడా చెల్లించాడు.
గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో టిమ్ డేవిడ్ ప్రవర్తన పరాకాష్టకు చేరింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక వివాదాస్పద డీఆర్ఎస్ రివ్యూ విషయంలో అసంతృప్తి చెందిన డేవిడ్, ఆన్-ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వైపు కోపంతో ఐస్ బ్యాగ్ను విసిరాడు. ఈ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ.. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.9ని ఉల్లంఘించినందుకు గానూ అతని ఫైనల్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లను ఇచ్చింది.
ఈ సీజన్ మొదట్లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా బంతి మార్పు విషయంలో అంపైర్ల సూచనలను ధిక్కరించినందుకు డేవిడ్కు 25 శాతం ఫీజు కోత పడింది. ఆ తర్వాత మరో మ్యాచ్లో డగౌట్ నుంచి అసభ్యకర హావభావాలు చూపించినందుకు 30 శాతం ఫీజు జరిమానా పడింది. అంతేకాకుండా, ఫైనల్ గెలిచిన తర్వాత బీసీసీఐ ప్రవేశపెట్టిన చంపక్ అనే ఏఐ రోబోటిక్ కెమెరాను తన్నేలా బెదిరిస్తూ వెటకారం చేశాడు. దీనికి తోడు అతను కప్ సెలబ్రేషన్స్లో సిగరెట్ తాగుతూ కనిపించిన ఫోటోలు కూడా నెట్టింట హల్చల్ చేశాయి.
ఆర్సీబీ ప్లేయర్స్ చేసిన ఈ పిచ్చి పనుల వల్ల విరాట్ కోహ్లీ చేసిన అద్భుత ప్రదర్శన మరుగున పడిపోతోందని అభిమానులు బాధపడుతున్నారు. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను మొదట 155 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ, ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఆడిన 42 బంతుల్లో 75 పరుగుల నాటౌట్ సుడిగాలి ఇన్నింగ్స్ వల్లే కప్ గెలిచింది. గాయంతో బాధపడుతూనే కోహ్లీ కెరీర్ లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసి జట్టును గెలిపిస్తే.. ఈ ఇద్దరు విదేశీ ప్లేయర్స్ మాత్రం తమ పిచ్చి చేష్టలతో ఆర్సీబీ బ్రాండ్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి