KL Rahul : రికార్డులన్నీ మనవే.. చరిత్ర సృష్టించాలంటే మనోళ్లే.. ఇంకా 47పరుగులు చేస్తే టాప్ ప్లేసులో రాహుల్

లార్డ్స్ టెస్ట్‌లో కేఎల్ రాహుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఒకవేళ అతను సెంచరీ చేస్తే, లార్డ్స్‌లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా దిలీప్ వెంగ్సర్కర్ సరసన నిలుస్తాడు. సచిన్, కోహ్లీల పేర్లు లార్డ్స్ ఆనర్స్ బోర్డులో లేకపోవడం గమనార్హం.

KL Rahul : రికార్డులన్నీ మనవే.. చరిత్ర సృష్టించాలంటే మనోళ్లే.. ఇంకా 47పరుగులు చేస్తే టాప్ ప్లేసులో రాహుల్
Kl Rahul

Updated on: Jul 12, 2025 | 3:01 PM

KL Rahul : ‘క్రికెట్ మక్కా’గా పిలుచుకునే లార్డ్స్ మైదానంలో ప్రతి క్రికెటర్ ఆనర్స్ బోర్డులో తమ పేరు నమోదు చేసుకోవాలని కలలు కంటారు. ఈ బోర్డులో పేరు నమోదు చేసుకోవాలంటే బౌలర్ ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు లేదా మొత్తం మ్యాచ్‌లో 10 వికెట్లు తీయాలి.. అదే బ్యాట్స్‌మెన్ అయితే సెంచరీ సాధించాలి. అయితే, భారత్ తరపున కేవలం 10 మంది బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే లార్డ్స్ మైదానంలో టెస్ట్ మ్యాచ్‌లలో సెంచరీలు సాధించి ఆనర్స్ బోర్డులో తమ పేరు నమోదు చేసుకున్నారు. ఈ జాబితాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పేర్లు లేకపోవడం గమనార్హం.

ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కేఎల్ రాహుల్ మాత్రమే లార్డ్స్‌లో సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్. అయితే, ఇప్పుడు అతను ఈ మైదానంలో ఇంకో సెంచరీ సాధించి అద్భుతం చేయాలని చూస్తున్నాడు. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో రాహుల్ 53 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. లార్డ్స్‌లో తన రెండో సెంచరీకి తను ఇంకో 47పరుగులు చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ కేఎల్ రాహుల్ మూడో రోజు సెంచరీ సాధిస్తే, లార్డ్స్‌లో ఒకటి కంటే ఎక్కువ టెస్ట్ సెంచరీలు సాధించిన రెండో భారతీయ ఆటగాడుగా నిలుస్తాడు. ఇప్పటి వరకు దిలీప్ వెంగ్సర్కర్ మాత్రమే లార్డ్స్‌లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ఏకైక భారత ఆటగాడు. ఈ చారిత్రక మైదానంలో అతను మూడు సెంచరీలు సాధించిన రికార్డు ఉంది.

ఈ జాబితాలో ఒక్కో సెంచరీతో మొత్తం తొమ్మిది మంది భారత బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. వారిలో అజిత్ అగార్కర్, మహ్మద్ అజారుద్దీన్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వినూ మంకాడ్, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, రవి శాస్త్రి, గుండప్ప విశ్వనాథ్ ఉన్నారు. వీరంతా తమ అద్భుతమైన బ్యాటింగ్‌తో లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తమ పేర్లను లిఖించుకున్నారు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో కేఎల్ రాహుల్ లార్డ్స్‌లో ఒక సెంచరీ సాధించాడు.

ప్రస్తుతం టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు జో రూట్ సెంచరీతో 387 పరుగులు చేసింది. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి, టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా 242 పరుగుల ఆధిక్యంలో ఉంది. అందుకే మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు సాధించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..