Babar Azam : నెట్స్ లో కాదు బాబర్ భయ్యా.. పిచ్ మీద ఆడితే కదా గెలిచేది.. ఇక్కడ ఎంత కొట్టినా వేస్ట్

Babar Azam : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఒక్కసారిగా కదలిక వచ్చింది. కొలంబో వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో పాక్ పరిస్థితి ఇప్పుడు చావో రేవో అన్నట్లుగా మారింది.

Babar Azam  : నెట్స్ లో కాదు బాబర్ భయ్యా.. పిచ్ మీద ఆడితే కదా గెలిచేది.. ఇక్కడ ఎంత కొట్టినా వేస్ట్
Babar Azam Practice Video

Updated on: Feb 17, 2026 | 4:57 PM

Babar Azam : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఒక్కసారిగా కదలిక వచ్చింది. కొలంబో వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో పాక్ పరిస్థితి ఇప్పుడు చావో రేవో అన్నట్లుగా మారింది. తదుపరి మ్యాచ్‌లో నమీబియాతో తలపడనున్న బాబర్ సేన, ఆ మ్యాచ్‌లో ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయం. ఈ నేపథ్యంలో పాక్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పగ తీర్చుకుంటున్నట్లుగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బాబర్ ఆజం, షాహీన్ ఆఫ్రిది నెట్స్‌లో ప్రదర్శించిన దూకుడు చూస్తుంటే నమీబియాకు ముప్పు తప్పదనిపిస్తోంది.

భారత్‌పై ఘోరంగా విఫలమైన కెప్టెన్ బాబర్ ఆజం, ప్రాక్టీస్ సెషన్‌లో తన కోపాన్నంతా బంతులపై చూపించాడు. హెడ్ కోచ్ మైక్ హెసన్ పర్యవేక్షణలో జరిగిన ఈ సెషన్‌లో బాబర్ చాలా ఆక్రోశంగా బ్యాటింగ్ చేశాడు. నసీమ్ షా, సల్మాన్ మీర్జా వేసిన షార్ట్ పిచ్ బంతులను, బౌన్సర్లను చీల్చి చెండాడాడు. గ్రౌండ్ నలుమూలలా క్లాసిక్ షాట్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది కూడా నిప్పులు చెరిగే బంతులతో ప్రాక్టీస్ చేశాడు. బౌలింగ్‌లోనే కాకుండా, బ్యాటింగ్‌లోనూ షాహీన్ సిక్సర్లతో హోరెత్తించడం విశేషం. ఇండియాపై డకౌట్ అయిన సాహిబ్జాదా ఫర్హాన్ కూడా గంటల తరబడి నెట్స్‌లో చెమటోడ్చాడు.

భారత్‌తో మ్యాచ్ తర్వాత బాబర్ ఆజం, షాహీన్ ఆఫ్రిదిలను జట్టు నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే కొలంబోలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌ను చూస్తుంటే వారిద్దరూ నమీబియాపై బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కోచ్ మైక్ హెసన్ ప్రతి ఆటగాడి కదలికలను నిశితంగా గమనిస్తూ, వారికి తగిన సూచనలు ఇస్తున్నారు. నమీబియాను తక్కువ అంచనా వేయకుండా, భారీ తేడాతో గెలిచి నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా పాక్ ప్రణాళికలు రచిస్తోంది.

ప్రస్తుతం గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది. ఆడిన 3 మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించినప్పటికీ, అమెరికా మెరుగైన రన్ రేట్‌తో పాక్ కంటే ముందుంది. అమెరికా తన నాలుగు గ్రూప్ మ్యాచ్‌లను పూర్తి చేసేసింది. ఇప్పుడు పాక్ గనుక నమీబియాను ఓడిస్తేనే సూపర్-8 చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ నమీబియా చేతిలో ఓడిపోతే మాత్రం బాబర్ సేన నేరుగా ఇస్లామాబాద్ విమానం ఎక్కాల్సిందే. అందుకే ఈ మ్యాచ్‌ను వారు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us