
2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచును భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. ముఖ్యంగా నువాన్ కులశేఖర బౌలింగ్లో మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన ఆ విన్నింగ్ సిక్స్ ప్రతీ ఒక్కరి గుండెల్లో నిలిచిపోయింది. 79 బంతుల్లో 91 రన్స్ చేసిన ధోనీ, ఇండియాకు రెండోసారి ప్రపంచకప్ను అందించాడు. అయితే ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే నువాన్ కులశేఖర, ఐపీఎల్లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు. ఆ తర్వాత ధోనీ ప్రవర్తన ఎలా ఉండేది? వరల్డ్ కప్ ఫైనల్ గురించి ధోనీ ఎప్పుడైనా మాట్లాడాడా? అనే విషయాలపై తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో కులశేఖర పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత తాను చెన్నై సూపర్ కింగ్స్ టీమ్లో చేరానని కులశేఖర గుర్తుచేసుకున్నాడు. ‘‘నేను వరల్డ్ కప్ ముగిసిన వెంటనే సీఎస్కే టీమ్లోకి వెళ్లాను. కానీ ధోనీ నా దగ్గర ఆ వరల్డ్ కప్ ఫైనల్ సిక్స్ గురించి కానీ, ఆ మ్యాచ్ గురించి కానీ ఒక్కసారి కూడా ఎత్తలేదు. అది అతని గొప్పతనానికి నిదర్శనం. ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటాడు. గతాన్ని గడిచిపోయిన విషయంగానే చూస్తాడు. అతని దృష్టి ఎప్పుడూ రాబోయే మ్యాచ్ను ఎలా గెలవాలి అనే దానిపైనే ఉంటుంది’’ అని కులశేఖర చెప్పుకొచ్చాడు. క్రికెట్లో పవర్ప్లే, డెత్ ఓవర్లలో ఏ బౌలర్కైనా సిక్సర్లు పడటం సహజమేనని, తాను ధోనీని అవుట్ చేయడానికి ప్రయత్నించినా అది కుదరలేదని అన్నాడు. అయితే 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాను ఓడించి తాము కప్ గెలవడం ఆ బాధను తుడిచిపెట్టేసిందని తెలిపాడు.
అదే ఫైనల్ మ్యాచులో గౌతమ్ గంభీర్ ఇచ్చిన క్యాచ్ను డ్రాప్ చేయడంపై కులశేఖర విచారం వ్యక్తం చేశాడు. ‘‘మేము ఆ మ్యాచ్ గెలుస్తామని భావించాం. కానీ గంభీర్ 30 పరుగుల వద్ద ఉన్నప్పుడు నేను ఒక ముఖ్యమైన క్యాచ్ వదిలేశాను. ఆ తర్వాత అతను 97 పరుగులు చేసి మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నాడు. ఆ క్యాచ్ వదిలేసినందుకు ఇప్పటికీ బాధ ఉంటుంది’’ అని అన్నాడు. అయితే పెద్ద మ్యాచుల్లో ఇలాంటివి జరుగుతుంటాయని.. 2016 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో వరుసగా 4 సిక్సర్లు ఇచ్చిన బెన్ స్టోక్స్.. ఆ తర్వాత 2019 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ను గెలిపించిన విషయాన్ని గుర్తుచేశాడు. అలాగే ఆ మ్యాచ్లో మంచు ప్రభావం కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిందని కులశేఖర తెలిపాడు.