T20 World Cup 2026 : నమీబియాతో మ్యాచ్‌కన్నా..కొలంబో పిచ్‌పైనే కోచ్‌ల గురి..టీమిండియా వ్యూహాలు మారుతున్నాయా?

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నమీబియాతో తలపడనున్న టీమిండియా ఇప్పుడు కేవలం ఈ మ్యాచ్‌పైనే కాకుండా, తదుపరి జరగబోయే కీలకమైన భారత్-పాక్ సమరంపై కూడా కన్నేసింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో టీమిండియా ఆటగాళ్లు తీవ్రమైన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు.

T20 World Cup 2026 : నమీబియాతో మ్యాచ్‌కన్నా..కొలంబో పిచ్‌పైనే కోచ్‌ల గురి..టీమిండియా వ్యూహాలు మారుతున్నాయా?
Team India

Updated on: Feb 12, 2026 | 11:00 AM

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నమీబియాతో తలపడనున్న టీమిండియా ఇప్పుడు కేవలం ఈ మ్యాచ్‌పైనే కాకుండా, తదుపరి జరగబోయే కీలకమైన భారత్-పాక్ సమరంపై కూడా కన్నేసింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో టీమిండియా ఆటగాళ్లు తీవ్రమైన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. కేవలం బ్యాటింగ్ మెరుపులకే పరిమితం కాకుండా, ఈసారి బౌలర్లు తమ పదును పెంచే పనిలో పడ్డారు. సాధారణంగా టోర్నమెంట్ మధ్యలో ఆటగాళ్లు శక్తిని కాపాడుకోవడానికి తక్కువ ప్రాక్టీస్ చేస్తుంటారు. కానీ మంగళవారం సాయంత్రం ఢిల్లీ నెట్స్‌లో టీమ్ ఇండియా బౌలర్లు దాదాపు రెండు గంటల పాటు పూర్తి తీవ్రతతో బౌలింగ్ చేశారు. పేసర్లు, స్పిన్నర్లు వేర్వేరు నెట్స్‌లో విడిపోయి తమ నైపుణ్యాలకు పదును పెట్టారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు రాణించినప్పటికీ, వారి నుంచి ఇంకా అత్యుత్తమ ప్రదర్శన రావాల్సి ఉందని అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డోష్కాట్ అభిప్రాయపడ్డారు.

నమీబియా మ్యాచ్ ఒక ఎత్తయితే.. ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్ మరో ఎత్తు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం పిచ్‌లు కాస్త మందకొడిగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఇప్పటివరకు చూసిన అన్ని బంతులను బాదాలి అనే దూకుడు వ్యూహాన్ని భారత్ మార్చుకోనుంది. స్లో పిచ్‌లపై టెక్నిక్‌తో ఆడటం ముఖ్యమని, పరిస్థితికి తగ్గట్టుగా బ్యాటర్లు అడాప్ట్ అవ్వాలని కోచ్ సూచించారు. 250 పరుగులు చేయాలనే లక్ష్యం కంటే, పరిస్థితులను బట్టి ఆడటం ఇక్కడ కీలకం.

పక్కటెముక గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ తన మొదటి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. సుందర్ రావడంతో టీమిండియాకు ఇప్పుడు నలుగురు ఆల్‌రౌండర్ల లగ్జరీ దొరికింది. పిచ్ కండిషన్స్ బట్టి ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయడానికి సుందర్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని కోచ్ వెల్లడించారు. బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉండటం సుందర్‌కు కలిసొచ్చే అంశం.

అభిషేక్ శర్మ ఇంకా కడుపునొప్పితో బాధపడుతున్న కారణంగా మంగళవారం సెషన్‌కు హాజరు కాలేదు. దీంతో నమీబియాతో మ్యాచ్‌లో అతను ఆడటం దాదాపు కష్టమే అనిపిస్తోంది. అతని స్థానంలో సంజూ శాంసన్ లేదా వాషింగ్టన్ సుందర్‌ను ఓపెనర్‌గా పంపే ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది. ఈ లోపు బుమ్రా కూడా తన బౌలింగ్ వర్క్‌లోడ్ పెంచాడు, ఇది భారత్‌కు శుభపరిణామం.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us