T20 World Cup 2026 : వరల్డ్ కప్‎లో అదిరిపోయే ట్విస్ట్..భారత్‌తో మ్యాచ్ ఆడబోమన్న పాక్..ఐసీసీకి కోట్లలో నష్టం

T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ 2026కు ముందే క్రికెట్ ప్రపంచంలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ మెగా టోర్నీలో తమ జట్టు పాల్గొంటుందని ప్రకటించిన పాకిస్థాన్ ప్రభుత్వం, ఫిబ్రవరి 15న కొలంబోలో టీమిండియాతో జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్‌ను మాత్రం బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసింది.

T20 World Cup 2026 : వరల్డ్ కప్‎లో అదిరిపోయే ట్విస్ట్..భారత్‌తో మ్యాచ్ ఆడబోమన్న పాక్..ఐసీసీకి కోట్లలో నష్టం
Pakistan

Updated on: Feb 01, 2026 | 9:12 PM

T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ 2026కు ముందే క్రికెట్ ప్రపంచంలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ మెగా టోర్నీలో తమ జట్టు పాల్గొంటుందని ప్రకటించిన పాకిస్థాన్ ప్రభుత్వం, ఫిబ్రవరి 15న కొలంబోలో టీమిండియాతో జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్‌ను మాత్రం బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలతో పాటు ఐసీసీపై నిరసన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి కేవలం కొద్ది రోజుల ముందే పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం పాక్ ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం.. పాకిస్థాన్ క్రికెట్ జట్టు శ్రీలంకలో జరిగే గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లన్నీ ఆడుతుంది కానీ, ఫిబ్రవరి 15న టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో మాత్రం ఫీల్డ్‌లోకి అడుగుపెట్టదు. దీనికి ప్రధాన కారణం ఐసీసీ ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ లో తమ మ్యాచ్‌లు ఆడలేమని బంగ్లాదేశ్ మొండికేయగా, ఐసీసీ వారిని టోర్నీ నుంచి తొలగించి స్కాట్లాండ్‌ను చేర్చుకుంది. ఈ విషయంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాక్ ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్‌కు భారీగా పాయింట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక జట్టు మ్యాచ్ ఆడటానికి నిరాకరిస్తే, ఆ మ్యాచ్‌ను ఓటమిగా పరిగణిస్తారు. తద్వారా భారత్‌కు కష్టపడకుండానే రెండు పాయింట్లు లభిస్తాయి. అయితే ఇక్కడ అసలు నష్టం పాయింట్ల కంటే ఆర్థికపరంగానే ఎక్కువగా ఉంటుంది. భారత్ పాక్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల ఆదాయం వస్తుంది. బ్రాడ్‌కాస్టర్లు మరియు స్పాన్సర్లు ఈ ఒక్క మ్యాచ్ కోసమే కోట్లాది రూపాయలు కుమ్మరిస్తారు. పాక్ గనుక ఈ మ్యాచ్ ఆడకపోతే ఐసీసీకి దాదాపు 38 మిలియన్ డాలర్ల (సుమారు రూ.315 కోట్లు) మేర నష్టం వాటిల్లుతుందని అంచనా.

మరోవైపు, ఈ బహిష్కరణ వల్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయ వాటాను నిలిపివేయడం లేదా భవిష్యత్తులో పాక్ వేదికగా జరిగే టోర్నీలపై నిషేధం విధించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా, బృందం శ్రీలంకకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. మరి చివరి నిమిషంలో ఐసీసీ మంతనాలు జరిపి పాక్ ప్రభుత్వాన్ని ఒప్పిస్తుందా? లేక ఈసారి భారత్-పాక్ మధ్య జరిగే మజాను ఫ్యాన్స్ మిస్ అవ్వాల్సిందేనా? అనేది వేచి చూడాలి.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..