
మరో 6 రోజుల్లో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. ఇందులో దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్స్ కూడా తమ పేర్లను నమోదు చేశారు. ఇక వారిలో ఒకడు మంగళవారం భారత్తో జరిగిన తొలి టీ20లో చెలరేగిపోయాడు. టీమిండియా టాప్ ఆర్డర్ను పేకముక్కల్లా పడగొట్టేశాడు. మొదటి టీ20లో టీమిండియా గెలిచినప్పటికీ.. ఈ సఫారీ బౌలర్ బౌలింగ్ హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించిన ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మరెవరో కాదు.. లుంగీ ఎంగిడి.
కటక్ వేదికగా భారత్తో జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా పేసర్ ఎంగిడి బలమైన ప్రదర్శన కనబరిచాడు. పవర్ ప్లేలో బౌలింగ్ ఓపెన్ చేసిన ఎంగిడి.. పొదుపుగా పరుగులు సమర్పించి.. మూడు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. గిల్(4), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(12), తిలక్ వర్మ(26)లను భారీ స్కోర్ సాధించనివ్వకుండా పెవిలియన్ చేర్చాడు. మొత్తంగా ఎంగిడి 4 ఓవర్లు వేసి 31 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్ మినీ వేలంలో తన పేరును నమోదు చేసుకున్న ఎంగిడి.. రూ. 2 కోట్ల క్యాప్డ్ బౌలర్ల లిస్టులో ఉన్నాడు. రాబోయే టీ20 మ్యాచ్లలోనూ ఇలాంటి ప్రదర్శనలే ఇస్తే.. కచ్చితంగా భారీ ధరకు వేలంలో అమ్ముడయ్యే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఎంగిడి గణాంకాల విషయానికొస్తే.. ఇప్పటిదాకా 20 టెస్టులు ఆడిన ఎంగిడి 5 వికెట్లు మూడుసార్లు తీసి.. మొత్తంగా 58 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 115 వికెట్లు.. టీ20ల్లో 74 వికెట్లు, ఐపీఎల్లో 29 వికెట్లు తీశాడు.