Video : 12 ఫోర్లు, 6 సిక్సర్లు.. 61 బంతుల్లో అజేయంగా 122 పరుగులు..కోహ్లీ బ్యాటింగ్ విధ్వంసం

2019 నవంబర్ తర్వాత విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ రాకపోయేసరికి... కోహ్లీ ఫామ్ పోయింది అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపు 1021 రోజులు, అంటే రెండున్నర సంవత్సరాల పైగా సాగిన ఈ 'సెంచరీ డ్రై'కి తెరదించుతూ 2022 ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ ఒక పవర్‌ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు.

Video : 12 ఫోర్లు, 6 సిక్సర్లు.. 61 బంతుల్లో అజేయంగా 122 పరుగులు..కోహ్లీ బ్యాటింగ్ విధ్వంసం
Virat Kohli

Updated on: Oct 23, 2025 | 4:08 PM

Video : క్రికెట్ ప్రపంచంలో కింగ్ కోహ్లీకి తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. అయితే, 2019 నవంబర్ తర్వాత అతని బ్యాట్ నుంచి సెంచరీ రాకపోయేసరికి… కోహ్లీ ఫామ్ పోయింది అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపు 1021 రోజులు, అంటే రెండున్నర సంవత్సరాల పైగా సాగిన ఈ సెంచరీ డ్రైకి తెరదించుతూ 2022 ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ ఒక పవర్‌ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ రోజు అతను ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లని ఒక ఆట ఆడుకున్నాడు.

సెప్టెంబర్ 8, 2022 నాడు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో, టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో రెస్ట్ తీసుకున్న రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ, తన కెరీర్‌లో మొట్టమొదటి టీ20 ఇంటర్నేషనల్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 61 బంతుల్లోనే నాబాదద్ 122 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 200 ఉండడం విశేషం.

ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో కోహ్లీ మొత్తం 12 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు బాదాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ తరచూ 50, 60 రన్స్ చేసినా, అవి సెంచరీకి చేరుకోకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, ఈ ఇన్నింగ్స్ ద్వారా తన క్లాస్‌ని, పవర్‌ని కలిపి చూపించి, తన బ్యాటింగ్ శైలి ఇంకా పదునుగా ఉందని రుజువు చేశాడు. కేఎల్ రాహుల్ (62 రన్స్) తో కలిసి తొలి వికెట్‌కు 119 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లీ పరుగుల సునామీ సృష్టించడంతో భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.

213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు టీమ్ ఇండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ చుక్కలు చూపించాడు. తన స్వింగ్ బౌలింగ్‌తో ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. కేవలం 4 ఓవర్లలో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు.

దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కోలుకోలేకపోయింది. అటు ఇబ్రహీం జద్రాన్ (64 నాటౌట్) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 101 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. విరాట్ కోహ్లీని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ సెంచరీని కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికకు అంకితమిచ్చాడు.

ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ ఫామ్ తిరిగి వచ్చిందనే సంకేతాలు ఇచ్చాడు. ఇది అతని అంతర్జాతీయ కెరీర్‌లో 71వ సెంచరీ. ఈ సెంచరీతో అతను రికీ పాంటింగ్ 71 సెంచరీల రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 503 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 25,500 కంటే ఎక్కువ పరుగులు, 76 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 131 అర్ధ సెంచరీలు చేసి క్రికెట్ ప్రపంచంలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై ఆడిన ఈ ఇన్నింగ్స్ అతని విరాట్ కోహ్లీ 2.0 ఫేజ్‌కి పునాది వేసిందని చెప్పొచ్చు. కానీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీసులో రెండు వన్డేల్లోనూ డకౌట్ అయి మళ్లీ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..