
IPL 2027 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు ఒక గుడ్న్యూస్ వెలువడింది. గత మూడేళ్లుగా దేశం వెలుపల విదేశీ గడ్డపై జరుగుతూ వస్తున్న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ప్రక్రియ మళ్లీ మన దేశానికే తిరిగి వస్తోంది. వచ్చే ఐపీఎల్ 2027 సీజన్కు సంబంధించిన మినీ వేలాన్ని భారతదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ గట్టి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సెప్టెంబర్ 15న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. కాగా చివరిసారిగా 2023లో కొచ్చి వేదికగా భారత్లో ఐపీఎల్ ఆక్షన్ జరగగా ఆ తర్వాత దుబాయ్, అబుదాబి, జెడ్డా వంటి విదేశీ నగరాల్లో ఈ వేలాన్ని నిర్వహించారు.
వేదిక సెలక్షన్ వెనుక ఉన్న అసలు కారణాలు
ఐపీఎల్ ఆక్షన్ను మళ్లీ భారత్లోనే నిర్వహించాలని నిర్ణయించడానికి ప్రధాన కారణం ఫ్రాంచైజీల నుంచి వచ్చిన విజ్ఞప్తులే. తమ టీమ్ డెలిగేట్లు, సిబ్బందిని ప్రతిసారీ విదేశాలకు తీసుకెళ్లడంలో మేనేజ్మెంట్ పరంగా ఎన్నో లాజిస్టిక్, ఆపరేషనల్ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని పలు ఫ్రాంచైజీలు గతంలో ఆందోళన వ్యక్తం చేశాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని గత ఏడాది అబుదాబిలో జరిగిన ఆక్షన్ సమయంలోనే బీసీసీఐ అధికారులు ఈ వేలాన్ని భారత్కు మార్చాలనే ఆలోచనపై దృష్టి పెట్టారు. అయితే ఖచ్చితమైన వేదికపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో, ఫైవ్-స్టార్ హోటళ్లలో గదుల లభ్యతను బట్టి బీసీసీఐ వేదికను, తేదీలను ఖరారు చేయనుంది. సాధారణంగా రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం కోసం దాదాపు 100 వరకు రూమ్లను బుక్ చేయాల్సి ఉంటుంది.
ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్పై ఉత్కంఠ
ఇదిలా ఉంటే గత కొంతకాలంగా క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఇంప్యాక్ట్ ప్లేయర్ నిబంధనపై మాత్రం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నిబంధనను కొనసాగించాలా వద్దా అనే దానిపై రాబోయే ఒక నెల రోజుల్లో మరోసారి ప్రత్యేక సమావేశం జరిగే అవకాశం ఉంది. చాలా వరకు ఫ్రాంచైజీలు ఈ రూమ్కు వ్యతిరేకంగానే ఉన్నప్పటికీ, మరికొన్ని మాత్రం దీనిని మరో ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కొనసాగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఇప్పటికే ఈ ఇంప్యాక్ట్ ప్లేయర్ నిబంధనను బహిరంగంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..