
Team India Weaknesses : టీ20 వరల్డ్ కప్ 2026 వేటను టీమిండియా నేడు ముంబై వేదికగా ప్రారంభించనుంది. వరుసగా రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాలని సూర్యకుమార్ యాదవ్ సేన పట్టుదలతో ఉంది. అయితే పైకి అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న భారత జట్టులో కొన్ని లోపాలు అభిమానులను కంగారు పెడుతున్నాయి. ఈ ఐదు వీక్నెసెస్ గనుక జట్టును వెంటాడితే, మన వరల్డ్ కప్ కల చెదిరిపోయే ప్రమాదం ఉంది. అవేంటో ఒకసారి చూద్దాం.
1. బ్యాటింగ్లో వీరులే.. కానీ కీపింగ్లో?
టీమిండియా వికెట్ కీపర్ స్థానం కోసం ఇషాన్ కిషన్, సంజు శాంసన్లను ఎంపిక చేసింది. వీరు బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించగలరు కానీ, వికెట్ల వెనుక మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ కివీస్తో జరిగిన సిరీస్లో కీపింగ్లో తడబడ్డాడు. బై రన్స్ ఇవ్వడంతో పాటు స్టంపింగ్ అవకాశాలను కూడా జారవిడిచాడు. టీ20ల్లో ఒక్క క్యాచ్ లేదా స్టంపింగ్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. ఇలాంటి కీలక సమయంలో వీరిద్దరి కీపింగ్ స్కిల్స్ జట్టుకు ఆందోళన కలిగిస్తున్నాయి.
2. జారవిడుస్తున్న క్యాచ్లు.. వదులుకుంటున్న విజయాలు
“క్యాచ్లు పడితేనే మ్యాచ్లు గెలుస్తాం” అన్నది క్రికెట్ సూత్రం. కానీ భారత జట్టు ఇటీవల క్యాచ్లు పట్టడంలో ఘోరంగా విఫలమవుతోంది. సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా లాంటి మెరుపు ఫీల్డర్లు ఉన్నప్పటికీ, జట్టు క్యాచ్ సక్సెస్ రేటు 75 శాతం కంటే తక్కువగా ఉండటం ఆందోళనకరం. గత వరల్డ్ కప్ ఫైనల్లో సూర్య పట్టిన ఆ ఒక్క క్యాచ్ మనల్ని విజేతగా నిలిపింది. మరి ఇప్పుడు ఆ ఏకాగ్రత లోపిస్తే ట్రోఫీ చేజారడం ఖాయం.
3. ఓపెనింగ్ జోడీలో క్లారిటీ లేకపోవడం
అభిషేక్ శర్మ ఓపెనర్గా ఫిక్స్ అయినా, అతడికి జోడీ ఎవరన్నది ఇంకా సస్పెన్స్గానే ఉంది. సంజు శాంసన్ వరుసగా ఫెయిల్ అవ్వడం, ఇషాన్ కిషన్ ఫామ్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇషాన్ కూడా ఒకటి రెండు మ్యాచ్ల్లో విఫలమైతే మళ్ళీ సంజు వైపు చూడాల్సి వస్తుంది. టోర్నీ సాగుతున్న కొద్దీ ఓపెనింగ్ జోడీని మారుస్తూ ఉంటే అది మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి పెంచుతుంది.
4. ఫిట్నెస్ సమస్యలు, గాయాలు
టీమిండియాను ప్రధానంగా వేధిస్తున్న సమస్య స్టార్ ఆటగాళ్ల ఫిట్నెస్. జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడు. అతడికి వెన్నునొప్పి సమస్య కూడా అప్పుడప్పుడు వేధిస్తుంటుంది. హార్దిక్ పాండ్యా ఎప్పుడు గాయపడతాడో ఎవరికీ తెలియదు. హర్షిత్ రాణా ఇప్పటికే దూరం కాగా, వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్పై క్లారిటీ లేదు. కీలక ఆటగాళ్లు మధ్యలో దూరమైతే జట్టు సమతుల్యత దెబ్బతింటుంది.
5. వైడ్లు, నోబాల్స్.. శాపంగా మారుతున్న ఎక్స్ట్రాలు
బౌలర్లు వేసే ఎక్స్ట్రా పరుగులు టీ20ల్లో పెద్ద నేరం. అర్షదీప్ సింగ్ తరచుగా వైడ్లు వేస్తూ విమర్శలు పాలవుతున్నాడు. సిరాజ్, హార్దిక్ పాండ్యా కూడా లైన్ అండ్ లెంగ్త్ తప్పి అదనపు పరుగులు ఇస్తున్నారు. బుమ్రా లాంటి దిగ్గజం కూడా కొన్నిసార్లు నోబాల్స్ వేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే సెమీస్ లేదా ఫైనల్ వంటి కీలక మ్యాచ్ల్లో కొంప ముంచే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..