
IND vs SA : సౌతాఫ్రికా టూర్లో ఇప్పటివరకు హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది, అయితే టెస్ట్ సిరీస్ను సౌతాఫ్రికా గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరు జట్ల మధ్య జరగబోయే ఐదు మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. 2025 సంవత్సరానికి భారత జట్టు ఆడబోయే చివరి అంతర్జాతీయ సిరీస్ ఇదే కావడం విశేషం. ఈ టీ20 పోరులో ఏ జట్టు విజయం సాధిస్తే, ఆ జట్టుకు సిరీస్ విజయంతో పాటు టూర్ విజేతగా కూడా నిలిచే అవకాశం ఉంటుంది.
భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లు దేశంలోని పలు ప్రముఖ క్రికెట్ వేదికల్లో జరగనున్నాయి. సిరీస్ ఆరంభ మ్యాచ్ డిసెంబర్ 9న కటక్లోని బారాబతి స్టేడియంలో జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 11న న్యూ చండీగఢ్లో రెండో టీ20, డిసెంబర్ 14న ధర్మశాలలో మూడో టీ20 జరగనున్నాయి. ఇక సిరీస్లోని చివరి రెండు మ్యాచ్లు డిసెంబర్ 17న లక్నోలో, డిసెంబర్ 19న అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ చివరి మ్యాచ్ అభిమానులకు ఒక పెద్ద పండుగలా మారనుంది.
భారత్, సౌతాఫ్రికా మధ్య టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే.. భారత్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య మొత్తం 31 టీ20 మ్యాచ్లు జరగ్గా, టీమిండియా ఏకంగా 18 మ్యాచ్లలో విజయం సాధించింది. సౌతాఫ్రికా 12 మ్యాచ్లలో గెలుపొందగా, ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. అయితే ఈ రికార్డులలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సౌతాఫ్రికా జట్టు భారతదేశంలో ఇప్పటివరకు ఒక్క టీ20 సిరీస్ను కూడా గెలవలేదు. ఈ చారిత్రక రికార్డును ఎలాగైనా బద్దలు కొట్టాలని సఫారీలు పట్టుదలగా ఉండగా, తమ అజేయ రికార్డును కాపాడుకోవాలని భారత జట్టు కసితో ఉంది. దీంతో ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ మరింత రసవత్తరంగా మారనుంది.