
Ind Vs Aus : భారత ఏ మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. టీ20 సిరీస్లో ఓటమి తర్వాత, వన్డే సిరీస్లో టీమ్ ఇండియా అద్భుతంగా పుంజుకుంది. ఆస్ట్రేలియా-ఎతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో భారత ఏ జట్టు, రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించి, సిరీస్ను కైవసం చేసుకుంది. చివరి ఓవర్లో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ బ్రిస్బేన్లో జరిగింది. బౌలింగ్లో మిన్ను మణి, బ్యాటింగ్లో లోయర్ ఆర్డర్ చేసిన అద్భుతమైన పోరాటం ఈ చారిత్రక విజయానికి కారణం.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా-ఎ జట్టు, 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఆ జట్టు తరపున ఓపెనర్ ఎలిస్సా హీలీ 91 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, కిమ్ గార్త్ 41 పరుగులతో నాటౌట్గా నిలిచింది. కానీ, ఇతర బ్యాట్స్మెన్ 30 పరుగుల మార్క్ను కూడా దాటలేకపోయారు. దీనికి ప్రధాన కారణం భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన. భారత్ తరపున మిన్ను మణి తన స్పిన్తో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టి 3 కీలక వికెట్లు తీసింది. సాయిమా ఠాకూర్ 2 వికెట్లు తీయగా, టిటాస్ సాధు, రాధా యాదవ్, ప్రేమ రావత్, తనుజా కన్వర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఏ జట్టుకు ఆరంభం అంత బాగా లేదు. ఒక దశలో 157 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ యాస్తిక భాటియా 66 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, టాప్ ఆర్డర్లో ఆమెకు ఎవరూ సహకరించలేదు. కానీ, లోయర్ ఆర్డర్ నుండి అద్భుతమైన పోరాటం మొదలైంది. రాధా యాదవ్ 60 పరుగులు చేసి జట్టును నిలబెట్టగా, తనుజా కన్వర్ 50, ప్రేమ రావత్ 32 పరుగులతో నాటౌట్గా నిలిచి చివరి ఓవర్లో జట్టుకు విజయాన్ని అందించారు. ఆస్ట్రేలియా వంటి బలమైన బౌలింగ్ అటాక్ను ఎదుర్కొని సాధించిన ఈ విజయం చాలా గొప్పది.
ఈ విజయంతో భారత ఏ మహిళా క్రికెట్ జట్టు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 2-0తో అజేయ ఆధిక్యాన్ని సాధించి సిరీస్ను గెలుచుకుంది. అంతకు ముందు మొదటి మ్యాచ్లోనూ భారత జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు చివరి వన్డే ఆగస్టు 17న జరగనుంది. ఆ తర్వాత ఒక అనధికారిక టెస్ట్ మ్యాచ్ కూడా ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..