
IND vs SL : భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ రాబోయే శ్రీలంక పర్యటన భారత టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్కు ఎంతో కీలకమైనదన్నారు. కేవలం ఒక మెయిన్ బ్యాటర్గానే కాకుండా, విదేశీ గడ్డపై జట్టును నడిపించే కెప్టెన్గా కూడా ఇది ఆయనకు అతిపెద్ద అగ్నిపరీక్ష అని కైఫ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గిల్ అత్యుత్తమ బ్యాటింగ్ ఫామ్లో ఉన్నప్పటికీ, లంక పిచ్లపై ప్రత్యర్థిని ఓడించి సిరీస్ గెలవడం ఆయన నాయకత్వ పటిమకు సవాలుగా మారనుందన్నారు. ఈ సిరీస్ మొత్తంలో శుభ్మన్ గిల్ వికెట్ టర్నింగ్ పాయింట్గా మారుతుందని, ఎందుకంటే ప్రస్తుత భారత బ్యాటింగ్ ఆర్డర్లో ఆయనే అత్యంత బలమైన వికెట్ అని పేర్కొన్నారు.
లంక స్పిన్ వ్యూహాలు
శ్రీలంక పర్యటనలో భారత బ్యాటర్లకు అత్యంత ప్రధానమైన సవాలు ప్రత్యర్థి స్పిన్ బౌలింగ్ విభాగమేనని కైఫ్ విశ్లేషించారు. ఇటీవలి కాలంలో స్వదేశంలో కూడా భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ముందర తీవ్రంగా తడబడ్డారని, ఈ బలహీనతను శ్రీలంక కోచింగ్ స్టాఫ్ ఖచ్చితంగా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. ముఖ్యంగా శ్రీలంక లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యను ఆ జట్టు ప్రధాన ఆయుధంగా కైఫ్ అభివర్ణించారు. జయసూర్య పిచ్పై వేసే తిరుగుడు బంతులు భారత బ్యాటర్లకు కఠిన పరీక్ష పెడతాయని, ఆయన బౌలింగ్ను ఎదుర్కొనేటప్పుడు టీమిండియా ఆటగాళ్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత లభించిన బ్రేక్ ప్లస్ పాయింట్
ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లకు లభించిన తగినంత బ్రేక్ ఈ పర్యటనలో ఎంతో ఉపయోగపడుతుందని కైఫ్ తెలిపారు. తరచుగా వరుస సిరీస్లు ఆడటం వల్ల క్రీడాకారులు కొత్త పరిస్థితులకు అలవాటు పడేందుకు, వ్యూహాలు మార్చుకునేందుకు సమయం దొరకదని, కానీ ఈసారి లభించిన సమయం ఆటగాళ్లను మానసికంగా, శారీరకంగా సిద్ధం చేసిందని అన్నారు. ఈ విరామం వల్ల రిఫ్రెష్ అయిన టీమిండియా, శ్రీలంక వాతావరణానికి త్వరగా అలవాటుపడి రాణించే అవకాశం ఉందన్నారు.
జడేజా రీఎంట్రీతో జట్టుకు దక్కిన కొండంత అండ
రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రావడం శుభ్మన్ గిల్ కెప్టెన్సీకి, టీమిండియాకు కొండంత బలాన్ని ఇస్తుందని కైఫ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్-1 ఆల్ రౌండర్గా ఉన్న జడేజా అనుభవం జట్టుకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. జడేజా స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు చేయగలడని, ఆయన బౌలింగ్ అత్యంత కచ్చితత్వంతో ఉండటమే కాకుండా ఫీల్డింగ్లోనూ అద్భుతాలు చేయగలడని కొనియాడారు. శ్రీలంక పిచ్లపై జడేజా పాత్ర అత్యంత కీలకం కానుందని చెప్పారు.
యువ ఆటగాళ్లు, దులీప్ ట్రోఫీ ముచ్చట్లు
జట్టులోకి కొత్తగా ఎంపికైన యువ ఆటగాళ్లు ఆకిబ్ నబీ, సారాంశ్ జైన్లకు మొదటి టెస్టు తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని కైఫ్ అభిప్రాయపడ్డారు. మ్యాచ్ ఆరంభంలో మేనేజ్మెంట్ సీనియర్, అనుభవజ్ఞులైన ఆటగాళ్లపైనే నమ్మకం ఉంచుతుందన్నారు. ఇక దులీప్ ట్రోఫీకి ఎంపికైన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఎంపికపై కైఫ్ హర్షం వ్యక్తం చేశారు. వైభవ్ బ్యాటింగ్ చూడటానికి అభిమానులు మైదానానికి పోటెత్తుతారని, ఈ టోర్నమెంట్లోనే అతడు అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..